యశవంతపుర: కన్నడ సినిమా దర్శకుడు రేణుకా శర్మ బుధవారం అర్ధరాత్రి బెంగళూరులో కరోనాతో మృతి చెందారు. రెండు రోజుల క్రితం కరోనా సోకింది. కవిరత్న కాళిదాస, శబరిమళైస్వామి అయ్యప్ప, అంజదగం తదితర 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. కన్నడ సినిమా రంగంలో సూపర్ హిట్ దర్శకునిగా గుర్తింపు ఉంది. కర్ణాటక వైచారిక సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమి ప్రశస్తి విజేత, ఉడుపికి చెందిన డాక్టర్ జి భాస్కర్ మయ్య(70) కరోనాతో మరణించారు. నాలుగు రోజుల క్రితం కరోనా సోకటంతో ఉడుపి జిల్లా సాలిగ్రామ ప్రణవ ఆస్పత్రిలో గురువారం చనిపోయారు.
క్రికెటర్ వేదా సోదరి బలి
భారతీయ మహిళ క్రికెటర్ వేదా కృష్ణమూర్తి సోదరి వత్సలా (40) కరోనాకు గురై గురువారం చిక్కమగళూరు జిల్లా కడూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. 10 రోజుల క్రితం కరోనాతో వేదా కృష్ణమూర్తి తల్లి చెలువాంబ (63) మరణించడం తెలిసిందే. రోజుల వ్యవధిలో ఇద్దరిని కరోనా పొట్టనబెట్టుకుంది.