Vikram: 'విక్రమ్‌కు అస్సలు నటించడమే రాదు'.. నటి భర్త, డైరెక్టర్‌ సంచలన కామెంట్స్!

10 Jan, 2024 12:36 IST|Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆయనకు పెద్దఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.  ఎలాంటి పాత్రనైనా ఇమిడిపోయే ప్రత్యేకత ఆయనకే సొంతం. అపరిచితుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ సినిమాలో ఏకంగా మూడు రూపాల్లో కనిపించి అభిమానులను మెప్పించాడు. అంతే కాదు కోలీవుడ్‌లో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

కాగా.. గతేడాది మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆయన మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. పా రంజిత్ డైరెక్షన్‌లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తోన్న తంగలాన్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త ఏడాదిలో జనవరి 26న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా ఈ కోలీవుడ్‌ స్టార్‌పై తమిళ డైరెక్టర్‌ సంచలన కామెంట్స్ చేశారు. ప్రముఖ తమిళ డైరెక్టర్, నటి దేవయాని భర్త రాజకుమారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. విక్రమ్‌ నటనను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

డైరెక్టర్ రాజకుమారన్ మాట్లాడుతూ..'విక్రమ్ గొప్ప నటుడని నేను అనుకోవడం లేదు. ఉత్తమ నటుడు అని అంగీకరించను కూడా. అతను కమల్ హాసన్, రజనీకాంత్‌లా నటించగలడు అంతే. అలా కాకుండా ఎలా నటించాలో కూడా అతనికి తెలియదు. అతను గెటప్ మార్పులు మాత్రమే మార్చగలడు. క్లోజ్-అప్ షాట్‌లలో మేక్ఓవర్‌,  విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా అతనికి ఎలా నటించాలో, ఎలా స్పందించాలో కూడా తెలియదు. స్పెషల్ ఎఫెక్ట్స్ లేకుండా విక్రమ్ ఆకట్టుకోలేకపోయాడు. నేను తీసిన విన్నుకుమ్ మన్నుకుమ్ చిత్రంలో అతనితో నాకు ఇదే సమస్య వచ్చింది. చేయి విరగగొట్టినట్లుగా, కాలు విరిగినట్లుగా, ఒక కన్ను కప్పినట్లుగా నటించడం నిజమైన నటన కాదు. మంచి నటుడు అలాంటి వాటిపై ఆధారపడకుండా భావోద్వేగాలను పండిచాలి. ముఖ్యంగా క్లోజప్ షాట్‌ల సమయంలో విక్రమ్ అలాంటి నటనను ప్రదర్శించలేడు.' అని అన్నారు. 

అయితే రాజకుమారన్ కామెంట్స్‌పై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్‌ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. విక్రమ్ ప్రతిభ ఉన్న నటుడని.. ఆయన అలా మాట్లాడడం తెలివితక్కువ పనేనని నెటిజన్స్ మండిపడుతున్నారు. కాగా.. 2001లో రాజకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కించిన  విన్నుకుమ్ మన్నుకుమ్ చిత్రంలో నటించారు.  రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమాలో శరత్‌కుమార్, ఖుష్బు, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.

>
మరిన్ని వార్తలు