'వ్యూహం' రెండో ట్రైలర్‌ పీక్స్‌.. రసగుల్లా కంటే చంద్రబాబే ఇష్టం: వర్మ

15 Dec, 2023 16:07 IST|Sakshi

టాలీవుడ్‌ సెన్సేషన్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'వ్యూహం'.. దివంగత నేత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయో ఉన్నది ఉన్నట్లు చూపించేదే  వ్యూహం సినిమా అని ఆర్జీవీ తెలిపారు. నవంబరు 10న విడుదల కావాల్సిన ఈ సినిమాపై నారా లోకేశ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెన్సార్‌ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో ఆ సమయంలో బ్రేక్‌ పడింది.

తర్వాత సెన్సార్‌ బోర్డు రివైజింగ్‌ కమిటీకి మళ్లీ సినిమాను పంపించడం ఆపై రామ్‌ గోపాల్‌ వర్మకు అనుకూలంగా సెన్సార్‌ క్లియరెన్స్‌ ఇవ్వడం వంటివి జరగడంతో.. డిసెంబర్‌ 29న వ్యూహం సినిమా విడుదలకు రెడీగా ఉంది. దీంతో వ్యూహం సినిమా నుంచి మరో ట్రైలర్‌ను ఆయన విడుదల చేశారు. మొదటి ట్రైలర్‌ మాదిరే రెండో ట్రైలర్‌ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది.ఈ క్రమంలో ఆయన తాజాగా మీడియా సమావేశం నిర్వహించి ఇలా వ్యాఖ్యానించారు.

'అరచేతిని అడ్డుపెట్టి ఎవరూ వ్యూహం సినిమాను ఆపలేరు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఫైనల్‌గా సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు ఎలాంటి మాయ చేసి క్లీన్ యు సర్టిఫికెట్ తెచ్చారని నన్ను అడగొద్దు. మళ్లీ చెబుతున్న ఏపీ సీఎం జగన్‌తో నాకు పరిచయం లేదు.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఏం జరిగింది..? అనేది ఈ వ్యూహం చిత్రంలో చూపించాము. ఇందులో అన్ని అంశాలను టచ్ చేసాము. గతంలో బయట వాళ్లు మైక్స్ దగ్గర ఏమీ చెప్పారో.. అది మాత్రమే ప్రజలకు తెలుసు కానీ వాళ్ల ఇంట్లో పర్సనల్‌గా చర్చించే విషయాలను కూడా  ఇందులో చూపించాను.

ఈ చిత్రంలో అన్ని క్యారెక్టర్లు ఫిక్షనల్ మాత్రమే.. నేను ఏమీ చూపించానో అనేది తెలియాలంటే సినిమా చూస్తే తెలుస్తుంది. సెన్సార్ సర్టిఫికెట్‌తో సినిమా పోస్టర్ డిజైన్ చేసిన చరిత్ర నాది. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేషన్ ఎలా వచ్చిందని చెబితే మమ్మల్ని జైలుకు పంపిస్తారు. దావూద్ ఇబ్రహీంతో ఫోన్ చేయించడం వల్ల వ్యూహం సినిమాకు సెన్సార్ చేశారు. వ్యూహం సినిమా ఒక పొలికల్ డ్రామా... వైఎస్సార్ చనిపోయిన దగ్గరి నుంచి జగన్ పాదయాత్ర వరకు వ్యూహం ఉంటుంది. రసగుల్లా కంటే కూడా చంద్రబాబు అంటేనే నాకు ఇష్టం.' అని ఆర్జీవీ అన్నారు.

ఈ సినిమాలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో తమిళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా, జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు