-

Animal Pre Release Event: నేడు తన అభిమాన హీరోను మల్లారెడ్డి కలుస్తారా.. స్పీచ్‌ కోసం ఫ్యాన్స్‌ వెయిటింగ్‌

27 Nov, 2023 12:19 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో మంత్రి చామకూర మల్లారెడ్డి పేరు సోషల్‌ మీడియాలో ఎప్పుడూ వైరల్‌ అవుతూనే ఉంటుంది. ఆయన స్పీచ్‌లో కొంతమేరకు కళాత్మకమైన హిడెన్‌ టాలెంట్‌ కనిపిస్తుంది. తన రాజకీయ విమర్శల్లో కూడా సినిమా డైలాగ్స్‌ కనిపిస్తుంటాయి. అలా  తెలంగాణ రాజకీయాల్లో ఆయన చాలా ఫేమస్. 'పాలమ్మినా.. పూలమ్మినా.. బోర్‌వెల్ నడిపినా.. కష్టపడ్డా.. పైకి వచ్చినా..' అంటూ ఆయన చెప్పే డైలాగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెడింగ్‌లోనే ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మల్లారెడ్డి మాట్లాడుతూ చిరంజీవి, పవన్ కల్యాణ్‌ కన్నా తానే ఫేమస్ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ సరదాగా మాట్లాడే ఆయనలో ఒక నటుడు కూడా కనిపిస్తాడు.

పలు సినిమాల్లో నటించాలనే కోరక తనకు ఉందని కూడా మల్లారెడ్డి‍ గతంలో చెప్పేవారు. ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీలో ఆయనకు ఇష్టమైన హీరో ప్రిన్స్‌ మహేశ్‌ బాబు అని చాలా ఇంటర్వ్యూలలో ఓపెన్‌గానే మల్లారెడ్డి చెప్పారు. శ్రీమంతుడు సినిమా ఆడియో వేడుకలో మహేశ్‌ గురించి ఆయన ఇలా చెప్పారు. 'మీకో ముఖ్యమైన విషయం చెబుతున్నా.. నేను మహేశ్‌ బాబు అభిమానిని. నేను ఈరోజు ఎంపీ అయినాను అంటే కూడా మహేశ్‌  సినిమా చూసే' అని తెలిపారు. సినిమాల్లో మాదిరి వాటిని ప్లాన్‌ చేసి.. దాని మాదిరిగానే సక్సెస్‌ అయ్యానన్నారు. మహేశ్‌ బాబును కలవాలనే పట్టుదలతోనే ఈ ఫంక్షన్‌కు వచ్చానని అప్పట్లో మల్లారెడ్డి తెలిపారు.

శ్రీమంతుడు సినిమా సమయంలో ఎంపీగా ఉన్న మల్లారెడ్డి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. నేడు (నవంబర్‌ 27) యానిమల్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రణబీర్‌ కపూర్‌- రష్మిక జోడీగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో డిసెంబర్‌ 1న విడుదల కానుంది. ఈమేరకు యానిమల్‌​ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్శిటీలో జరగనుంది. ఆ ఈవెంట్‌కు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమంలో తన అభిమాన హీరో అయన మహేశ్‌ను మంత్రి మల్లారెడ్డి కలుస్తారా..? అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.  గతంలో ఎక్కడో ఫంక్షన్‌ జరుగుతుంటే... అదే పనిగా వెళ్లి మహేశ్‌ను కలిశాడు మల్లారెడ్డి.. ఇప్పుడు యానిమల్‌ వేడుక తన సొంత కాలేజీలోనే జరుగుతుంది. అక్కడికి ప్రిన్స్‌ వస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఛాన్స్‌ను ఆయన ఎట్టిపరిస్థితిల్లో పోగొట్లుకోరని సమాచారం. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన ఒకవేళ ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందులో ఆయన స్పీచ్‌ ఎలా ఉంటుందోనని మహేష్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్‌పై గంతంలో మల్లారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను వారు షేర్‌ చేస్తున్నారు.

A post shared by Mahesh Babu FC (@_urstrullymahesh_)

A post shared by Mahesh Babu FC (@_urstrullymahesh_)

మరిన్ని వార్తలు