అన్నంత పని చేసిన మన్సూర్ అలీఖాన్

9 Dec, 2023 09:19 IST|Sakshi

తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ శుక్రవారం నటి త్రిష కృష్ణన్, నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్, నటుడు చిరంజీవిపై మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. కోటి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్‌లో కోరారు. మన్సూర్ అలీఖాన్ వీడియో మొత్తం చూడకుండా తన పరువుకు భంగం కలిగించారని ఆరోపించారు. ఈ కేసు డిసెంబర్ 11వ తేదీ సోమవారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది.

నటి త్రిష కృష్ణన్‌పై మన్సూర్ ఖాన్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనను నటి త్రిష కృష్ణన్, LEO డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, మాళవిక మోహనన్, చిరంజీవి, మరికొందరు నటీనటులతో పాటు తమిళ నటుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దీని తర్వాత నటి, పొలిటీషియన్, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అలీఖాన్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో కోరారు. దీంతో చెన్నై థౌజండ్ లైట్ పోలీసులు మన్సూర్ అలీఖాన్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

(ఇదీ చదవండి: 'యానిమల్‌' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్‌ ఎంపీ ఫైర్‌)

ఫిర్యాదు దాఖలైన సమయంలో, మన్సూర్ అలీఖాన్ చెన్నై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు, మన్సూర్ అలీఖాన్ ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో త్రిషకు మన్సూర్‌ క్షమాపణలు చెప్పాడు. ఆయన క్షమాపణలను కూడా త్రిష అంగీకరించింది.

త్రిష Vs మన్సూర్‌ మధ్య ఏం జరిగిందంటే 
నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ కొద్దిరోజుల క్రితం  ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హీరోయిన్‌ త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని, 'లియో'లో కూడా అలాంటి ఛాన్స్‌ త్రిషతో కూడా ఉంటుందని  భావించినట్లు వ్యంగ్యంగా కామెంట్‌ చేశాడు. కానీ లియో సినిమాలో అలాంటి సీన్‌ లేకపోవడంతో తనకు బాధ కలిగిందన్నాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

దీంతో త్రిష కూడా మన్సూర్‌పై ఫైర్‌ అయింది. ఇలాంటి వారితో ఒక్క సినిమాలో కూడా నటించనందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో త్రిషకు మెగా స్టార్ చిరంజీవి, నితిన్‌, రోజా, రాధిక, సింగర్ చిన్మయి,లోకేశ్‌ కనగరాజ్‌,కుష్బూ నిలిచారు.

>
మరిన్ని వార్తలు