నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘విక్రమ్’. హరిచందన్ దర్శకత్వంలో నాగవర్మ నిర్మించారు. దివ్యా రావు కథానాయిక. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమాలోని మొదటి పాట ‘చుక్కలాంటి అమ్మాయి...’ని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి చేతుల మీదగా విడుదల చేయించారు. సురేశ్ ప్రసాద్ స్వరపరచిన ఈ పాటను పృథ్వీ చంద్ర పాడారు. కోటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని పాటలన్నీ బావున్నాయి. కథ కూడా బాగుంది. నా ప్రియ శిష్యుడు సురేశ్ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ‘‘ప్రేమలో పడే ఓ సినిమా రైటర్ సమాజంలోని కొన్ని కారణాల వల్ల ప్రేయసి నుంచి విడిపోవాల్సి వస్తుంది. మళ్లీ కలిసే ఒక అవకాశం వస్తే ఎలా ఉంటుందనేది ప్రధాన ఇతివృత్తం’’ అన్నారు నాగవర్మ. ‘లవ్ థ్రిల్లర్ చిత్రమిది. ఓ సినిమా రచయిత ప్రేమకథ ఇది’’ అన్నారు దర్శకుడు హరిచందన్.