Nayantara: చంద్రముఖి 2: లారెన్స్‌తో జతకట్టనున్న నయనతార?

11 Mar, 2023 09:29 IST|Sakshi

తమిళసినిమా: నృత్య దర్శకుడు లారెన్స్‌ ఇప్పుడు కథానాయకుడిగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈయన నటిస్తున్న రుద్రన్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్‌ 14న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా పి.వాసు దర్శకత్వంలో నటిస్తున్న చంద్రముఖి–2 చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. దీంతోపాటు అధికారం, జిగర్‌ తండా-2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.

తాజాగా మరో నూతన చిత్రానికి కమిట్‌ అయినట్లు సమాచారం. లారెన్స్‌కు హర్రర్‌ కామెడీ జానర్‌ లక్కీ అనే చెప్పాలి. ఇంతకుముందు ఈయన నటించిన కాంచన చిత్రం సీక్వెల్‌ అన్నీ ఈ జానర్‌లో రూపొంది విజయం సాధించిన చిత్రాలే. అదేవిధంగా శివలింగ చిత్రం, ప్రస్తుతం నటిస్తున్న చంద్రముఖి 2 చిత్రం హర్రర్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రాలే. తాజాగా ఈయన అంగీకరించిన చిత్రం కూడా హర్రర్‌ కామెడీ కథా చిత్రమేనని సమాచారం.

ఈ చిత్రాన్ని మేయాదమన్‌ చిత్రం ఫేమ్‌ రతన్‌కుమార్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. దీన్ని దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో నయనతారను నాయకిగా నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ సంచలన నటి హిందీలో షారూఖ్‌ఖాన్‌ సరసన నటిస్తున్న జవాన్‌ చిత్రం ఒక్కటే ఉంది. జయంరవి సరసన నటిస్తున్న ఇరైవన్‌ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుంది. లారెన్స్‌ జతకట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం. 
 

మరిన్ని వార్తలు