ఓటీటీల్లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు

31 May, 2023 14:36 IST|Sakshi

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు వ్యతిరేక హెచ్చరికల ప్రకటనను ఇకపై ఓటీటీలో కూడా ప్రసారం చేయాలని ఉత్తర్వూలు జారీ చేసింది. ఈ మేరకు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రచారాన్ని నిషేదిస్తూ 2004నాటి చట్టంలో నిబంధనలను సవరిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

‘పొగాకు వినియోగం క్యాన్సర్‌ కారకం’, ‘పొగాకు వినియోగం ప్రాణాంతకం’అని థియేటర్స్‌లో ప్రదర్శించినట్లే..ఇకపై ఓటీటీ కార్యక్రమాల్లోనూ కనీసం 30 సెకన్ల పాటు ప్రదర్శించాలని ఉత్తర్వూ​ల్లో పేర్కొంది. అంతేకాదు ఈ హెచ్చరిక ప్రకటన ఓటీటీ కంటెంట్‌ ప్రసారమయ్యే భాషలోనే ఉండాలని ఆదేశించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆరోగ్య, సమాచార ప్రసార శాఖ ప్రతినిధులు కఠిన చర్యలు తీసుకుంటారని కేంద్రం హెచ్చరించింది. దీంతో ఇప్పటి వరకు సినిమా థియేటర్లు, టీవీల్లో కనిపిస్తున్న ఈ పొగాకు వ్యతిరేక యాడ్స్ ఇక ఓటీటీల్లోకి కూడా రానున్నాయి.

పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే దుష్పలితాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఓటీటీల్లో పొగాకు వ్యతిరేక హెచ్చరికలను ప్రదర్శించాలనే నిబంధన తీసుకొచ్చింది.

మరిన్ని వార్తలు