చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు : పోసాని

28 May, 2023 12:38 IST|Sakshi

లక్ష్మీ పార్వతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నించాడు: పోసాని 

సాక్షి, విజయవాడ: లక్ష్మీ పార్వతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు చాలా  ప్రయత్నించాడని, కానీ ఎన్టీఆర్‌ మాత్రం అవేవి పట్టించుకోలేదని నటుడు, ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి అన్నారు. ఎన్టీఆర్‌ 100వ జయంతి నేడు. ఈ సందర్భంగా విజవాడలో ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌, దేవినేని నెహ్రూ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో పోసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్‌ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన నెంబర్‌ వన్‌ హీరో అని తెలుసు.. కృష్ణుడు అని తెలుసు.. వెన్నుపోటు పొడిపించుకున్నవాడని తెలుసు. చంద్రబాబు చేతుల్లో చనిపోయాడని తెలుసు. నేను చెప్పాల్సింది ఏం లేదు.

(చదవండి: వాళ్లే ఎన్టీఆర్‌కు నిజమైన వారసులు: లక్ష్మీపార్వతి )

ఎన్టీఆర్‌ జీవితంలో మీకు తెలియని కొన్ని నిజాలు చెబుతా. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతిని ఆయనే తీసుకొచ్చుకున్నాడు. ఆమెకు అప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయి. ఆమె ఓ లెక్చరర్‌. సంస్కృతం బాగా వచ్చు. గొప్ప మేధావి. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్‌ పక్కన ఉంటే తన ఆటలు సాగవని చంద్రబాబు భావించాడు. ఎలాగైనా ఆమెను బయటకు పంపించాలని కుట్ర పన్నాడు. లక్ష్మీ పార్వతి స్నేహితురాలి కొడుకుతో ఆమెకు అక్రమ సంబంధం ఉందని పుకార్లు పుట్టించాడు. ఇదే విషయం ఎన్టీఆర్‌ వరకు వెళ్లింది. ఓ రోజు ఎన్టీఆర్‌.. లక్ష్మీ పార్వతిని, ఆ అబ్బాయిని, చంద్రబాబుని ఇంట్లోకి పిలిపించుకున్నాడు. తిరుపతి లడ్డు ఆ అబ్బాయి చేతిలో పెట్టి.. ‘దీనిపై ప్రమాణం చేసి చెప్పు.. లక్ష్మీ పార్వతికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి?’ అని అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి గట్టిగా ఏడుస్తూ..‘లక్ష్మీ పార్వతి నాకు తల్లి లాంటిది సర్‌. నేను ఏ తప్పు చేయలేదు’ అని చెప్పాడు.

అప్పుడు వెంటనే ఎన్టీఆర్‌ తన కుటుంబ సభ్యులందరిని పిలిచి.. ‘నా ఆరోగ్యం సహకరించడం లేదు. తోడు కోసం ఆ అమ్మాయి(లక్ష్మీ పార్వతి)ని పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాడు. అప్పుడు ఇంట్లో వాళ్లు ఎవరూ ఒప్పకోలేదు. కారణం ఎన్టీఆర్‌ ఎక్కడ తన ఆస్తులన్నీ ఆమెకు ఇస్తారోననే భయం. కానీ లక్ష్మీ పార్వతి ఎప్పుడూ ఆస్తుల గురించి ఎన్టీఆర్‌ దగ్గర ప్రస్తావించలేదు. ఓ గొప్ప వ్యక్తికి తోడుగా ఉంటున్నానని సంతోష పడింది. చంద్రబాబు చేసే పనుల వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో చిన్న పిల్లాడిలా అతన్ని చూసుకుంది లక్ష్మీ పార్వతి గారే. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు.

ఆయన్ని బతికించుకోవడం కోసం ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తుంది లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్‌ ఆస్తులన్నీ చంద్రబాబు, అతని వారసులు తీసుకుంటే.. ఈమె మాత్రం ఇప్పటికి అతని పేరుని బతికించుకోవడం కోసం కష్టపడుతోంది. అవార్డులు, సేవా కార్యక్రమాలు చేసుకోవడం కోసం తన గాజులతో సహా అన్ని అమ్ముకుంది. కానీ వైఎస్‌ జగన్‌ చేతిలో ఘోరంగా ఓడిన తర్వాత.. ఇప్పుడు ఎన్టీఆర్‌ బొమ్మను చూసి ఓట్లు వేయండి అంటూ చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నాడు. రామరావు ఆత్మ శాంతించాలంటే మళ్లీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి రావాలి. చంద్రబాబు లాంటి గుణంలేని నాయకుడికి తగిన బుద్ది చెప్పాలి’అని పోసాని అన్నారు. 

మరిన్ని వార్తలు