'కమిట్‌మెంట్‌ ఇస్తే అవకాశంతోపాటు రూ.లక్ష ఇస్తామన్నారు'

24 Jun, 2021 11:48 IST|Sakshi

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించిన తెలుగమ్మాయిలు చాలా తక్కువనే చెప్పాలి. గతంలో సౌందర్య, స్నేహ వంటి పలువురు తారలు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. కానీ వాళ్లంతటి రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు తారలు ప్రస్తుతం లేరనే చెప్పాలి. అయితే ఇక్కడివారికి అవకాశాలివ్వకపోవడమే అందుకు కారణమంటోంది పచ్చీస్‌ హీరోయిన్‌ శ్వేతా వర్మ.

బాలీవుడ్‌లో హిందీ వచ్చినవాళ్లనే హీరోయిన్లుగా తీసుకుంటారని, కానీ టాలీవుడ్‌లో మాత్రం తెలుగు రానివాళ్లను కూడా కథానాయికగా ఎంపిక చేసుకుంటారని చెప్తోంది. ఇక్కడి హీరోయిన్లకు సరైన ప్రాధాన్యత ఇవ్వరని, సినిమా అవకాశాలు కూడా చాలా తక్కువేనంటోంది. అదే విధంగా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికీ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని తెలిపింది. ఈ సందర్భంగా గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని శ్వేత తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

"నేను షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తున్న సమయంలో కొందరు కమిట్‌మెంట్‌ ఇవ్వాలని అడిగారు. ఏదైనా ప్రాజెక్ట్‌ కోసం అడుగుతున్నారనుకున్నా. కానీ వాళ్ల ఉద్దేశ్యం వేరని తర్వాత అర్థమైంది. ఇప్పటికీ దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు నా దగ్గరున్నాయి. 2015లో యాడ్స్‌ కోసం సంప్రదించారు. లక్ష రూపాయలిస్తాం కానీ దర్శకుడు కోరుకుంది చేయాలని చెప్పారు. దీంతో షాకైన నేను సరే, అయితే అతడిని కూడా నేను చెప్పింది చేయమనండి. వెంటనే అతడిని బిల్డింగ్‌ మీద నుంచి దూకమనండి అని బదులిచ్చాను. ఈ క్యాస్టింగ్‌ కౌచ్‌ సమస్యలను నేరుగా ఎదుర్కోలేదు కానీ ఆన్‌లైన్‌, సోషల్‌ మీడియా ద్వారానే ఎదుర్కొన్నాను" అని శ్వేతా వర్మ చెప్పుకొచ్చింది.

చదవండి: రెమ్యునరేషన్‌ భారీగా పెంచిన మాస్‌ మహారాజా, ఎంతంటే!

మరిన్ని వార్తలు