సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్‌.. ఎలాగంటే

9 Feb, 2024 07:20 IST|Sakshi

పాపులర్‌ హీరోయిన్లు సినిమాల్లో బాగానే సంపాదిస్తారన్నది ఎవరూ కాదనలేరు. అయితే సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ వారు దీటుగా సంపాదించవచ్చని కోలీవుడ్‌ హీరోయిన్‌ ప్రీతా విజయకుమార్ నిరూపించారు. ఈమె గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు అనుకుంటా. నటుడు విజయ్‌ కుమార్‌, మంజుల దంపతుల నలుగురు కూతుర్లలో ఒకరు ప్రీత. సినీ కుటుంబానికి చెందిన ఈమె కూడా 1998లో రుక్మిణి అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమయ్యారు.

ఆ తరువాత తెలుగు, మలయాళం భాషల్లోనూ నటించిన ప్రీత నరసింహ చిత్రంలో రజనీకాంత్‌ కూతుర్లలో ఒకరిగా నటించి పాపులర్‌ అయ్యారు. ఆ తరువాత మా అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు, చందు, వంటి చిత్రాల్లో నాయకిగా నటించారు. ఆ తరువాత 2002లో దర్శకుడు హరిని పెళ్లి చేసుకుని నటనకు స్వస్తి చెప్పి సంసార జీవితంలో సెటిల్‌ అయ్యారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. నటనకు దూరంగా ఉంటున్న ప్రీత సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.

తన సోదరి శ్రీదేవి ఇతర స్నేహితురాళ్లతో కలిసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ లైవ్‌లో ఉంటున్న ప్రీత ఇతర వ్యాపారంలోనూ బిజీగా వున్నారు. ఈమె చైన్నె సముద్రతీరంలోని ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీత ప్యాలెస్‌ పేరుతో ఒక అందమైన కల్యాణ మండపాన్ని నిర్మించారు. దాని సమీపంలోనే మెట్రో కాఫీ హౌస్‌ ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేసే వాళ్లందరూ మహిళలు కావడం విశేషం.

మద్రాస్‌ కాఫీ పేరుతో ఇప్పటికే పలు ప్రాంచైజీలు కూడా ఆమె ఇవ్వడం జరిగింది. వీరితో పాటు స్థానిక సాలిగ్రామంలోని సినీ ఎడిటింగ్‌, డబ్బింగ్‌ స్టూడియోను నిర్వహిస్తున్నారు. ఇలా ప్రీత నెలకు లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మరో పక్క ఈమె భర్త హరి కమర్షియల్‌ దర్శకుడిగా మంచి ఫామ్‌లో వున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega