Rewind 2021: ఈ ఏడాది ఓటీటీల బిజినెస్‌ మాములుగా లేదుగా!

26 Dec, 2021 09:03 IST|Sakshi

మనదేశంలో  ‘ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ)’ ప్రసారాలను  మొదటగా 2008లో  రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ  ప్రారంభించింది ‘బిగ్‌ ఫ్లిక్స్‌’ పేరుతో. అయితే ఈ ఓటీటీ మార్కెట్‌ అనూహ్యంగా పెరిగింది మాత్రం కరోనా వల్ల వచ్చిన లాక్‌డౌన్‌ పుణ్యంతోనే. 2020తో పాటు 2021 సంవత్సరాన్నీ ‘ఓటీటీ నామ సంవత్సరం’గా పేర్కొన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. 

ప్రస్తుతం నలభైకి పైగా ఓటీటీ ప్రొవైడర్స్‌ ఇంటర్‌నెట్‌ ఆధారంగా తమ ప్రసారాలను అందిస్తున్నాయి. వాటిలో నెట్‌ఫ్లిక్స్‌ (2016, జనవరిలో మన దేశంలో మొదలైంది), అమెజాన్‌ ప్రైమ్, హాట్‌స్టార్, సోనీలివ్, వూట్, మాక్స్‌ ప్లేయర్, హోయ్‌ చోయ్‌ (ప్రాంతీయ భాషల్లో తొలి ఓటీటీ) వంటివెన్నో ఉన్నాయి. వీటిలో ‘ఇరోస్‌ నౌ’ ఓటీటీ దాదాపు పన్నెండు వేలకు పైగా సినిమాల కంటెంట్‌తో అత్యధిక సినిమా సాఫ్ట్‌వేర్‌ ఉన్నసంస్థగా రికార్డ్‌ సృష్టించింది. తెలుగులో2020, ఫిబ్రవరిలో ‘ఆహా’ ప్రారంభమై తెలుగు ప్రేక్షకులలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న వేదికగా నిలిచిందిప్పుడు. 

మనదేశంలో ఈ ఓటీటీ వ్యాపారం 2018లో 2150 కోట్ల రూపాయలు ఉండగా, 2019 నాటికి 3,500 కోట్ల రూపాయలకు పెరిగింది. 2020 నాటికి 6,500 కోట్ల రూపాయలకు, ఈ ఏడు అంటే 2021కి దాదాపు ఎనిమిదివేల కోట్ల రూపాయలకు చేరుకుంది. అలాగే 2021లో ఓటీటీలో ప్రసారమైన సినిమాల్లో దేశం మెత్తం మీద అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాగా తమిళంలో సూర్య, జ్యోతిక నిర్మించిన ‘జై భీమ్‌’ సినిమా నిలిచింది. ఇంటర్‌నెట్‌ మూవీ డేటా బేస్‌ (ఐఎమ్‌డీబీ) నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడై, 2021లో ప్రజలపై ఓటీటీ వేదిక చూపించన ప్రభావానికి తెర ఎత్తు ఉదాహరణగా మిగిలింది. ఈ వేదికపై ప్రసారం అవుతున్న సినిమాలు, ఇతర కార్యక్రమాల విషయంలో ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో భారత ప్రభుత్వం 2021లో సెన్సార్‌షిప్‌ ప్రమాణాలను ప్రకటించింది. ఈ వేదిక ద్వారా ప్రసారం అవుతున్న కంటెంట్‌ను అయిదు కేటగరీలుగా నిర్ధారించింది.

మరిన్ని వార్తలు