తమిళ చిత్రానికి అరుదైన ఘనత.. ఆ లిస్ట్‌లో చోటు!

28 Oct, 2023 09:13 IST|Sakshi

లెన్స్‌, మస్కిటో ఫిలాసఫీ, తలైకూత్తల్‌ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు జయప్రకాష్‌ రాధాకృష్ణన్‌ తెరకెక్కించిన చిత్రం కాదల్‌ ఎంబదు పొదువుడమై.  ఈ చిత్రాన్ని ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌ చిత్ర దర్శకుడు జియో బేబీ సమర్పణలో మెన్‌ కైండ్‌ సినిమాస్‌, నితీష్‌ ప్రొడక్షన్స్‌, సిమెట్రీ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.  ఈ చిత్రంలో సీనియర్ నటి రోహిణి కీలకపాత్రలో నటించారు. ఆమెతో పాటు లిజోమోల్‌, వినీత్‌, కలేశ్‌ రామనాథ్‌, అనుష్క, దీప ప్రధాన పాత్రలు పోషించారు.

తాజాగా కాదల్‌ ఎంబదు పొదువుడమై మూవీ 54వ ఇండియన్‌ పనోరమ అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైనట్లు మేకర్స్ తెలిపారు.  తమిళ చిత్రం కాదల్‌ ఎంబదు పొదువుడమై ఎంపిక కావడం విశేషం. ఈ ఏడాది  నవంబర్‌ 20 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరగనున్నాయి. 

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఈ ఆధునికకాలంలో మనుషుల భావాలు, దురాలోచనలు, సామాజిక పరిస్థితి, విజ్ఞానం వంటి అంశాలతో కూడిన ఆధునిక ప్రేమను ఆవిష్కరించే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. కాగా 2023 ఏడాదిగానూ ఇండియన్‌ పనోరమ చిత్రోత్సవాలకు 408 చిత్రాలు నామినేట్‌ కాగా.. అందులో 25 చిత్రాలు మాత్రమే ఎంపికై నట్లు చెప్పారు. ఆ 25 చిత్రాల్లో తమ కాదల్‌ ఎంబదు పొదువుడమై చిత్రం చోటుచేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా.. ఈ సినిమాకు కన్నన్‌ నారాయణన్‌ సంగీతమందించగా.. శరవణన్‌ సినిమాటోగ్రఫీ అందించారు. 

మరిన్ని వార్తలు