Rukhsar Rehman: రెండో భర్తకు కూడా విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైన నటి, 5 నెలలుగా..

29 Jun, 2023 18:53 IST|Sakshi

బాలీవుడ్‌ నటి రుక్సర్‌ రెహమాన్‌, దర్శకనిర్మాత ఫరూఖ్‌ కబీర్‌ దంపతులు విడిపోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా వీరికి పొసగడం లేదని, తరచూ గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తారాస్థాయికి చేరడంతో విడిపోవడమే నయమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వార్తలపై రుక్సర్‌ రెహమాన్‌ స్పందించింది. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

పెంట చేయాలనుకోవడం లేదు
ఓ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'అవును, మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం, కొంతకాలంగా దూరంగా ఉంటున్నాం. ఫిబ్రవరి నుంచి మేము విడివిడిగానే జీవిస్తున్నాం. విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నాం. ఇదంత సులువుగా తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనక ఉన్న కారణాలను, వివరాలను కూపీ లాగి పెంట చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను' అని చెప్పుకొచ్చింది.

మొదటి భర్తకు విడాకులు.. రెండో సారి..
కాగా నటి రెహమాన్‌ తొలుత అసద్‌ అహ్మద్‌ను పెళ్లాడింది. వీరికి ఐషా అహ్మద్‌ అనే కూతురు జన్మించింది. ఈమె కూడా నటిగా స్క్రీన్‌పై తళుక్కుమని మెరిసింది. అయితే రెహమాన్‌, అసద్‌ల మధ్య దూరం పెరగడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రెహమాన్‌.. ఫరూఖ్‌ కబీర్‌ ప్రేమలో పడింది. ఆరేళ్లు డేటింగ్‌లో ఉన్న తర్వాత 2010లో పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే రెహమాన్‌.. దీపక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన 'యాద్‌ రఖేగి దునియా' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. పీకే, గాడ్‌ టుస్సి గ్రేట్‌ హో, 83, ఖుదా హఫీజ్‌ 2 వంటి పలు చిత్రాల్లో నటించింది.

చదవండి: రాకేశ్‌ మాస్టర్‌ గురించి తొలిసారి ఓపెన్‌ అయిన శేఖర్‌ మాస్టర్‌

మరిన్ని వార్తలు