వైష్ణో దేవి అమ్మవారిని సందర్శించిన షారుక్‌ ఖాన్‌.. ఆ సెంటిమెంట్‌ కలిసొచ్చిందా?

12 Dec, 2023 14:06 IST|Sakshi

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డంకీ' డిసెంబర్ 21న విడుదల కానుంది. ఇప్పటికే ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా సినిమా విడుదలకు ముందు హీరో షారుక్‌ ఖాన్‌ జమ్మూలోని వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం జమ్మూలోని కత్రా వద్దకు ఆయన చేరుకున్నారు. ఏడాది సమయంలో  మూడవసారి ఈ పవిత్ర స్థలాన్ని షారుక్‌ సందర్శించారు. 2023లో షారుక్‌ ఖాన్‌ రెండు  బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకున్న విషయం తెలిసిందే.

ఈ ఏడాది ప్రారంభంలో  పఠాన్ సినిమాతో రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన షారుక్‌ ఆ తర్వాత జవాన్ సినిమాతో కూడా మరో సూపర్‌ హిట్‌ను అందుకున్నారు. ఈ రెండు సినిమా విడుదలకు ముందు కూడా ఆయన వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. 'పఠాన్‌' విడుదలకు ముందు 2022 డిసెంబర్‌ 12న వైష్ణోదేవి ఆలయంలో పూజలు నిర్వహించిన షారుక్‌.. మళ్లీ 'జవాన్‌' విడుదలకు ముందు ఆగస్టులో మరోసారి అక్కడికి వెళ్లారు. మళ్లీ ఇప్పుడు 'డంకీ' విడుదల సమయంలో అక్కడ పూజలు నిర్వహించారు. అలా వైష్ణోదేవి అమ్మవారి సెంటిమెంట్‌ను షారుక్‌ పాటిస్తున్నారు.

అమ్మవారి ఆలయం చుట్టూ షారుక్‌ తిరుగుతుండగా పలువురు వీడియోలు తీశారు. ఆయనతో పాటు తన అంగరక్షకులు, మేనేజర్ పూజా దద్లానీ ఉన్నారు. తన సినిమాలు విజయం సాధించాలని విడుదలకు ముందే పలు దేవాలయాలను ఆయన సందర్శిస్తారు. జవాన్‌ సినిమా సమయంలో తిరుమల శ్రీవారిని కూడా ఆయన దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రాజ్ కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో రానున్న 'డంకీ'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో షారుఖ్‌తో పాటు బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్ తదితరులు నటించారు. 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ ఈ మధ్యే విడుదలైంది. దానికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్‌ వస్తుంది. డిసెంబర్‌ 22న డంకీ చిత్రానికి పోటీగా ప్రభాస్‌ సలార్‌ వస్తున్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు