-

Dhanush-Aishwarya Rajinikanth: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు హైకోర్టులో ఊరట  

15 Jul, 2022 08:42 IST|Sakshi

నటుడు ధనుష్, ఆయన మాజీ భార్య (వీరు ఇటీవలే విడిపోయారు) ఐశ్వర్య రజనీకాంత్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళ్లితే నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం వేలై ఇల్లా పట్టాదారి. వండర్‌ బార్‌ సంస్థ  2014లో నిర్మించిన చిత్రం ఇది. ఈ సంస్థకు నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. కాగా, ఈ చిత్రంలో పొగ తాగే సన్నివేశాలు చోటుచేసుకున్నాయని, ఆ సన్నివేశాల్లో చట్టపరమైన హెచ్చరిక నిబంధనలు పాటించనందున, నటుడు ధనుష్, నిర్మాతలపైన  తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు పొగాకు నియంత్రణ ప్రజా సమితి తరఫున 2014 జూలైలో ప్రభుత్వానికి ఫిర్యా దు చేశారు.

చదవండి: బడా వ్యాపారవేత్త నన్ను జీతం తీసుకునే భార్యగా ఉండమన్నాడు: హీరోయిన్‌

దీంతో ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌.. ధనుష్‌ ఐశ్వర్య రజనీకాంత్‌పై స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 15వ తేదీన కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసును కొట్టివేయాలని, తమను సైదాపేట కోర్టులో హాజరవ్వాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ చెన్నై హైకోర్టులో విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎన్‌. సతీష్‌ కుమార్‌ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌  సైదాపేట న్యాయస్థానంలో హాజరయ్యే అంశంపై స్టే విధిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేశారు.  

మరిన్ని వార్తలు