కడసారి చూపుకు కదలి వచ్చారు..

26 Sep, 2020 11:12 IST|Sakshi

ఎస్పీబీకి ‘అభిమాన’ నీరాజనం..

సాక్షి, చెన్నై : ప్రఖ్యాత గాయకుడు, గాన గందర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియల ప్రక్రియ కొనసాగుతోంది. చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో ఆయన అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. కోట్లాది అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానం సంపాదించిన బాలుకు తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని ఆదేశించింది. అభిమానులు పెద్ద ఎత్తున వస్తుండటంతో అంత్యక్రియలకు ఆలస్యమవుతోందని కుటుంబ సభ్యులు సందర్శనాన్ని నిలిపివేశారు.

సంప్రదాయంగా చేయాల్సిన క్రతువును పూర్తి చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో బాలు అంతిమయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, ప్రముఖులకు మాత్రమే అనుమతినిచ్చారు. కోవిడ్‌ నిబంధనల దృష్ట్యా బాలు భౌతికకాయాన్ని సందర్శించేందుకు ప్రజలకు అనుమతి లేదని తెలిపారు. అభిమానులు ఎవరూ బాలు అంత్యక్రియలకు రాకుండా, ఫాంహౌస్‌కు 2 కి.మీ దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

అంత్యక్రియలు చివరి నిమిషంలో పలువురు ప్రముఖులు బాలుకు నివాళి అర్పించారు. శుభలేఖ సుధాకర్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, నేపధ్య గాయకుడు మనో, దర్శకుడు భారతీరాజ ఫామ్ హౌస్‌ ఆయన భౌతిక కాయనికి నివాళులు అర్పించారు. ఆయన మరణము సంగీత ప్రపంచానికి తీరని లోటు దేవీ శ్రీప్రసాద్‌ ఆవేదన చెందారు. ఈరోజు చాలా చీకటి రోజుని, ఆయన లాంటి వ్యక్తి ఇక రారు, ఆయనకు సాటి లేరని ఉద్వేగానిక లోనయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. (పాటవై వచ్చావు భువనానికి...గానమై.. గగనానికి)

ఎస్పీ బాలు భౌతిక కాయాన్ని చూసి దర్శకుడు భారతీరాజ కన్నీటి పర్యవంతమైయ్యారు. ‘ఎస్పీ బాలు ఎప్పటికీ నాతోనే ఉంటారు. ఆయన ఆత్మ మాతోనే ఉంది. భౌతికంగా మాత్రమే దూరం అయ్యాయి. పాటలు రూపంలో ఎప్పటికి చిరస్థాయిగా ప్రజలు మదిలో నిలిచిపోతారు’ అని విలపించారు.


బాలు ఇక లేరన్న సమాచారం అభిమాన లోకాన్ని కన్నీటి సంద్రంలో ముంచింది. తమ అభిమాన గాయకుడ్ని కడసారి చూసుకునేందుకు పోటెత్తారు. సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు ఈ మరణ సమాచారాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తమ అభిమాన గాయకుడ్ని కడసారి చూసుకునేందుకు పోటెత్తారు. అభిమానుల రాక పోటెత్తడంతో ఎస్పీబి ఇంటి పరిసరాలు ఇసుకెస్తే రాలనంతంగా పరిస్థితి మారింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ పరిసరాల్లోకి పెద్ద ఎత్తున జన సందోహం తరలి రావడంతో ఆరోగ్య పరమైన ఆందోళన తప్పలేదు. అభిమానుల్ని కట్టడి చేయడం మరింత కష్టతరంగా మారింది. (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత)

మరిన్ని వార్తలు