CWC 2023: డికాక్‌, బుమ్రాలను కాదని రచిన్‌కే దక్కింది..!

10 Nov, 2023 12:50 IST|Sakshi

2023 అక్టోబర్‌ నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును న్యూజిలాండ్‌ రైజింగ్‌ స్టార్‌ రచిన్‌ రవీంద్ర దక్కించుకున్నాడు. ఈ అవార్డు కోసం క్వింటన్‌ డికాక్‌ (సౌతాఫ్రికా), జస్ప్రీత్‌ బుమ్రా (భారత్‌) పోటీపడినప్పటికీ చివరికి రచిన్‌నే వరించింది. అక్టోబర్‌ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను రచిన్‌ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.

ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రచిన్‌ బ్యాట్‌తో పాటు బం​తిలోనూ చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో‌ 3 సెంచరీలు, 2 అర్ధ‌ సెంచరీల సాయంతో 565 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే  7 వికెట్లు కూడా పడగొట్టాడు.

తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసిన రచిన్‌.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న ఓ వరల్డ్‌కప్‌ రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో 25 ఏళ్ల వయసులోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రచిన్‌ (565).. సచిన్‌ రికార్డును (523) తుడిచిపెట్టాడు. లంకతో జరిగిన మ్యాచ్‌లో రచిన్‌ రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. మొత్తానికి ఈ వరల్డ్‌కప్‌ రచిన్‌కు కలగా మిగిలిపోనుంది.

కాగా, శ్రీలంకపై విజయంతో న్యూజిలాండ్‌ సెమీస్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో ఊహించని అద్భుతం​ జరిగితే తప్ప కివీస్‌ సెమీస్‌ చేరుకుండా ఉండదు. ఈ నెల 15న ముంబైలో భారత్, న్యూజిలాండ్‌ మధ్య తొలి సెమీఫైనల్‌ జరిగే అవకాశం ఉంది. 16న కోల్‌కతాలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్‌ ఖరారైపోయింది. 
 

మరిన్ని వార్తలు