Manchu Vishnu: వారిని సన్మానించిన మంచు విష్ణు 

6 Sep, 2021 08:17 IST|Sakshi

‘‘ఉపాధ్యాయ దినోత్సవం అనేది ముఖ్యమైన పండుగ. ‘శ్రీ’ విద్యానికేతన్‌ కుటుంబంలో ఉపాధ్యాయ  దినోత్సవం అంతర్భాగం’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా  హైదరాబాద్‌లో పలువురు గురువులను, కోవిడ్‌ సమయంలో సాయమందించిన సినీ కళాకారులను మంచు విష్ణు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–

‘‘ఉపాధ్యాయులకు శాశ్వత గౌరవ సూచకంగా, విద్యారంగంలోని వారి సేవలకు గుర్తింపుగా శ్రీ విద్యానికేతన్‌ ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో వారిని సత్కరించే గొప్ప సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. కోవిడ్‌ మహమ్మారి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అనేక మంది జీవితాలను కుదిపేసింది.

మంచి హృదయం కలిగిన సినీ ప్రముఖులు, కళాకారులు చాలామందికి నగదు, నిత్యావసర వస్తువుల రూపంలో సహాయం అందించారు. పవిత్రమైన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రామ సత్యనారాయణ, నటులు నరేశ్, పృథ్వీ, శివ బాలాజీ, గౌతమ్‌ రాజు, నటి మధుమిత తదితరులు పాల్గొన్నారు.  

చదవండి : హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్‌ శంకర్‌ కూతురు
Bigg Boss 5 Telugu: బుల్లితెర హంగామా మొదలైంది

మరిన్ని వార్తలు