దేవుడి పాట నాదే

4 Oct, 2023 00:34 IST|Sakshi
రవితేజ

‘గుంటూరు రైల్వే స్టేషన్‌.. దేవుడి పాట పాతికవేలు’ అంటూ వేలం పాటతో మొదలైంది ‘టైగర్‌ నాగేశ్వర రావు’ సినిమా ట్రైలర్‌. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వర రావు’. నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటించారు. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 20న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ముంబైలో ‘టైగర్‌ నాగేశ్వర రావు’ ట్రైలర్‌ని విడుదల చేశారు. పోలీసులకు విజ్ఞప్తి.. కాకినాడ నుంచి మదరాసు వెళ్లు సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ దారిలో దోపిడీకి గురి కాబోతోంది’, ‘కొట్టే ముందు.. కొట్టేసే ముందు వార్నింగ్‌ ఇవ్వడం నాకు అలవాటు’, ‘రేపటి నుంచి స్టూవర్టుపురంలో దేవుడి పాట నాదే.. చెప్పు.. వాడికి’ అంటూ రవితేజ చెప్పే డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి.

ముంబైలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో పాల్గొన్న రవితేజ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంతో హిందీ పరిశ్రమలోకి రావడం హ్యాపీగా ఉంది. హిందీలో నేనే డబ్బింగ్‌ చెప్పాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో అభిషేక్‌ అగర్వాల్, వంశీ, నటీనటులు రేణూ దేశాయ్, గాయత్రీ భరద్వాజ్, అనుపమ్‌ ఖేర్, జిషు సేన్‌ మాట్లాడారు.

మరిన్ని వార్తలు