Sikkim Floods Updates: సిక్కిం వరదల్లో గల్లంతైన 'దానవీర శూరకర్ణ' నటి..!

7 Oct, 2023 12:28 IST|Sakshi

ఇటీవల సిక్కింలో అనూహ్యంగా సంభవించిన వరదల్లో అలనాటి నటి సరళ కుమారి ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి ఆచూకీని కనిపెట్టాలంటూ  తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

(ఇది చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) 

1983లో మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికైన సరళ కుమారి.. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన దాన వీర శూరకర్ణ, ఆ తర్వాత సంఘర్షణ లాంటి చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైటెక్  సిటీ ప్రాంతంలో ఆమె నివాసముంటున్నారు. ఈ నెల అక్టోబరు 2న ఆమె తన మిత్రులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన గురించి అమెరికాలో ఉంటున్న కుమార్తె నబితకు కూడా ఆమె సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సిక్కింలో ఆకస్మాత్తుగా వచ్చిన వరదల తర్వాత సరళ కుమారి ఆచూకీ గల్లంతవ్వడంతో ఆమె కుమార్తె నబిత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అక్టోబరు 3న చివరిసారిగా నేను అమ్మతో మాట్లాడినట్లు నబిత తెలిపింది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదని.. వార్తల్లో వరదల గురించి తెలుసుకున్నా.. ఆర్మీ నంబర్లకు ప్రయత్నించినా అవీ కూడా పనిచేయడం లేదు. దయచేసి మా అమ్మను కనిపెట్టండి అంటూ  తెలంగాణ ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈశాన్య రాష్ట్రం సిక్కింలో కుంభవృష్టి కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో ఆర్మీ జవాన్లు సైతం గల్లంతయ్యారు. 

(ఇది చదవండి: మూగ అమ్మాయితో సినిమాలా?.. నీకేమైనా పిచ్చా అన్నారు: అభినయ తండ్రి ఎమోషనల్!)

మరిన్ని వార్తలు