యాంకర్‌గా ఎంట్రీ.. హీరోయిన్‌గా సెటిల్‌.. ఆ తారలు ఎవరంటే..

12 Jun, 2021 11:02 IST|Sakshi

సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఆ రంగుల్లో బతికేయాలని, రంగులేసుకుని రాణించాలని చాలామంది కలలు కంటుంటారు. అయితే వారిలో చాలా త‌క్కువ మందికే ఆ క‌ల‌లు నెర‌వేర‌తాయి. సాధారణంగా చాలా మంది అమ్మాయిలు హీరోయిన్‌ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే స్టార్‌ హీరోయిన్‌ అయిపోతారు. హీరోయిన్‌గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలాంటి అదృష్టం కొంతమంది యాంకర్స్‌కి దక్కింది. ఇండస్ట్రీలోకి యాంకర్‌గా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్లుగా ఎదిగిన కొంతమంది తారల గురించి..

మెగా డాటర్‌ నిహారిక.. ఇండస్ట్రీకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్‌గా మారిపోయింది. మొదట్లో ఆమె ఓ డ్యాన్స్‌ షోకి యాంకర్‌గా పనిచేసింది. అక్కడ ఆమె యాంకరింగ్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వెబ్ సిరీస్ న‌టిగా తెలుగు ప్రేక్షకులకు చేరువై.. ‘ఒక మనసు’ మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

హీరోయిన్‌ రెజీనా ఒకప్పుడు యాంకర్‌గా పని చేసిందన్న విషయం చాలా మందికి తెలియదు. హీరోయిన్‌గా ఎంట్రీ కంటే ముందు ఆమె  ఓ చానల్‌లో ప్రసారమయ్యే క్విజ్‌ ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా పనిచేంది. 16 ఏళ్ల వయసులోనే ‘కందనాల్‌ ముదల్‌(2005)’సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2012 లో శివ మనసులో శృతి (SMS)అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. 

కలర్స్‌ స్వాతి... చిన్న వయసులోనే బుల్లితెరపై ‘కలర్స్’ప్రోగ్రామ్‌తో పాపులర్ అయింది.యాంకర్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలో బహుముఖ పాత్రలు పోషించి హీరోయిన్‌గా మారింది. 2008లో ఆమె హీరోయిన్‌గా నటించిన అష్టా చెమ్మా చిత్రం విజయవంతం అవడం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావడం, తరువాత అనేక అవకాశాలు రావడం జరిగింది. 2008 లో ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది. 

అనసూయ భరద్వాజ్‌.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ యాంకర్‌గా రాణిస్తోంది. ఎన్టీఆర్‌ ‘నాగ(2003)’సినిమాతో కెరీర్‌ మొదలు పెట్టిన అనసూయ.. ఆ తర్వాత ఓ కామెడీ షో ద్వారా యాంకర్‌గా స్థిరపడింది. ఒక వైపు యాంకరింగ్‌ చేస్తూనే మధ్య మధ్యలో వెండితెరపై తళుక్కున మెరుస్తుంది ఈ హాట్‌ యాంకరమ్మ. ఎక్కువ టీవీ షోలతోనే పాపులర్ అయిన అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. ముఖ్యంగా ‘క్షణం', ‘రంగస్థలం'లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. ‘కథనం' అనే సినిమాతో హీరోయిన్‌గా మరి తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.  ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ', రవితేజ ‘ఖిలాడి’లొ నటిస్తుంది. 

శ్రీముఖి ​కూడా యాంకర్‌గానే తన కెరీర్‌ని ప్రారంభించింది. ఇప్పటికి యాంకరింగ్ చేస్తూనే వస్తుంది మధ్యమధ్యలో అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తుంది.  2015 లో చంద్రిక సినిమా తో శ్రీముఖి హీరోయిన్ అవతారం ఎత్తింది.

హాట్‌ బ్యూటీ రష్మి గౌతమ్‌.. ప్రస్తుతం ఉన్న టాప్‌ యాంకర్లలో ఈమె కూడా ఒకరు. 2007లో యాంకరింగ్‌లోకి అడుగుపెట్టి.. ఇప్పుడు హీరోయిన్‌గా రాణిస్తోంది. అంతకంటే ముందు ఈ బ్యూటీ పలు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వచ్చింది. 2016 లో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమా తో రష్మీ హీరోయిన్ గా పరిచయం అయింది.

మరిన్ని వార్తలు