Trisha: విజయ్‌ లియో మూవీ నుంచి సైడైపోయిన త్రిష? నిజమేంటంటే?

9 Feb, 2023 08:27 IST|Sakshi

హీరో విజయ్‌ తాజా చిత్రం లియో షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్‌ స్టూడియో పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. త్రిష కథానాయికగా కనిపించనుంది. మరో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్‌ను ఎంపిక చేశారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్, మన్సూర్‌ అలీఖాన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్‌ ఇటీవలే కాశ్మీర్‌కు వెళ్లింది. అక్కడ నెలకుపైగా భారీ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసినట్లు సమాచారం. అయితే ఇక్కడే సమస్య మొదలైంది. కాశ్మీర్‌లో చలి వణికిస్తోందట. లియో చిత్ర యూనిట్‌ చలితో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. దీంతో చిత్ర యూనిట్‌ అక్కడ షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసుకుని అనుకున్న దాని కంటే ముందుగానే చెన్నైకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే త్రిష మాత్రం ఇప్పటికే  చెన్నైకి వచ్చేసిందని ప్రచారం జరుగుతుండగా, ఆమె రావడానికి చలి కారణం కాదని, చిత్రంలో త్రిష పాత్ర పరిధి తక్కువని, నటి ప్రియా ఆనంద్‌నే ప్రధాన హీరోయిన్‌ అని టాక్‌ వైరల్‌ అవుతోంది. త్రిష ఫ్లాష్‌బ్యాక్‌లో మాత్రమే కనిపిస్తుందని తెలియడంతో ఆమె దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌తో గొడవ పడినట్లు, దీంతో చిత్రం నుంచి వైదొలగినట్లు మరో పక్క ప్రచారం వైరల్‌ అవుతోంది. దీని గురించి త్రిష తల్లి ఉమ స్పందించారు. త్రిషపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఆమె లియో చిత్రం నుంచి వైదొలగలేదని వివరణ ఇచ్చారు. కాగా సుమారు 14 ఏళ్ల తరువాత త్రిష, విజయ్‌తో జత కడుతున్న చిత్రం లియో కావడం గమనార్హం.

చదవండి: ఉలవచారు బిర్యానీ ఇష్టం: రాజ్‌కుమార్‌

మరిన్ని వార్తలు