Varun Tej and Lavanya Tripathi: వరుణ్- లావణ్య పెళ్లి.. ఆ సినిమా డైలాగ్ నిజమైంది!

2 Nov, 2023 18:02 IST|Sakshi

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. టుస్కానీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. వారి పెళ్లికి ముందు జరిగిన కాక్‌టైల్‌, మెహందీ, హ‌ల్దీ వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. 

అల్లు అరవింద్ కామెంట్స్!

అయితే గతంలో లావణ్యను ఉద్దేశించి నిర్మాత అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘చావు కబురు చల్లగా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లావణ్య మాట్లాడుతుండగా మధ్యలో మైక్ అందుకున్న అల్లు అరవింద్.. 'ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు చక్కగా మాట్లాడుతోంది. ఇక్కడే ఒక కుర్రోడిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుంది’ అని అన్నారు. అదే ఇప్పుడు నిజమైందంటూ నెటిజన్స్ కూడా తెగ కామెంట్స్ చేశారు.

ఆ సినిమా డైలాగ్‌ నిజమైంది

అలాగే లావణ్య త్రిపాఠి ప్రేమ పెళ్లి అయినప్పటికీ.. యాదృచ్ఛికంగా కొన్ని సంఘటనలు నిజ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అల్లు అరవింద్ మాటల్లాగే.. ఓ సినిమా డైలాగ్ కూడా తెగ ట్రెండ్ అవుతోంది. గతంలో లావణ్య త్రిపాఠి నటించిన అందాల రాక్షసి సినిమాలో ఈ పెళ్లికి సరిగ్గా సెట్ అవుతుంది. అందులో కొంతమంది పిల్లలు మాట్లాడుతూ..' లావణ్య అక్కా.. నీ పెళ్లికి సినిమా యాక్టర్స్ వస్తున్నారంటా కదా? అంటే పెళ్లికి చిరంజీవి కూడా వస్తాడా? అంటూ లావణ్యను అడుగుతారు. అందుకు లావణ్య కూడా అవునని చెబుతుంది. ఆ తర్వాత పిల్లలంతా గ్యాంగ్ లీడర్ కూడా వస్తున్నారంటూ అల్లరి చేస్తారు. ఆ సినిమా డైలాగ్ 2012లో వచ్చినా.. 2023లో అదే సీన్ రిపీట్ అయిందంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు మన నిజ జీవితంలో జరగడం చాలా అరుదుగా చూస్తుంటాం కదా! 

కాగా.. అందాల రాక్షసి హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం. ఇందులో నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, ఎస్. ఎస్. రాజమౌళి వారాహి చలన చిత్ర పతాకంపై నిర్మించారు.ఈ చిత్రం 2012 ఆగస్టు 10 న విడుదలైంది.

మరిన్ని వార్తలు