Vijay Sethupathi: హిట్‌ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమా చేస్తున్న విజయ్‌ సేతుపతి

23 Nov, 2023 13:54 IST|Sakshi

కోలీవుడ్‌ నటుడు విజయ్‌సేతుపతి కెరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రం సూదు కవ్వుమ్‌. తమిళ్‌ విడుదలైన ఈ సినిమా ఆయన తొలి కమర్షియల్‌ హిట్‌గా నిలిచింది. దీనిని దర్శకుడు నలన్‌ కుమారసామి తెరకెక్కించాడు. ఆ తరువాత వీరి కాంబినేషన్లో రూపొందిన కాదలుమ్‌ కడందుపోగుమ్‌ చిత్రం కూడా కోలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించింది. దీంతో విజయ్‌సేతుపతి, దర్శకుడు నలన్‌ కుమార్‌స్వామిల చిత్రం అంటే చాలా అంచనాలు ఉంటాయని చెప్పవచ్చు.

అలాంటి హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ కానున్నదని తాజా సమాచారం అందుతుంది. దర్శకుడు నలన్‌ కుమారస్వామి ప్రస్తుతం నటుడు కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనికి  టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది కార్తీ నటిస్తున్న 26వ చిత్రం. ఇందులో ఆయన ఎంజీఆర్‌ అభిమానిగా నటిస్తున్నట్టు తెలిసింది. నటి కీర్తిసురేష్‌ నాయకిగా నటిస్తున్న ఈ క్రేజీ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియాలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇదే సంస్థ తర్వాత విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నలన్‌ కుమారస్వామి దర్శకత్వంలో చిత్రాన్ని చేయనున్న ట్లు సమాచారం. దీనికి సంబంధించిన సింగిల్‌ లైన్‌ స్టోరీ కూడా సిద్ధమైనట్లు తెలిసింది. ఇందులో మరో ముగ్గురు స్టార్‌ నటులు నటించే అవకాశం వున్నట్లు సమాచారం. ప్రస్తుతం కార్తి  చిత్రం షూటింగ్‌ పూర్తి అయిన తరువాత విజయ్‌సేతుపతి హీరోగా నటించే మల్టీ స్టారర్‌ చిత్రాన్ని ప్రారంభించే అవకాశం వున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. వారిద్దరి గత చిత్రాలు తమిళం వరకే పరిమితం అయ్యాయి. కానీ ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ చేయనున్నారు.

మరిన్ని వార్తలు