Dil Raju : 'అందరూ నామీద పడి ఏడుస్తున్నారు'.. వారసుడు వాయిదాపై దిల్‌రాజు క్లారిటీ

9 Jan, 2023 11:12 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన తాజా చిత్రం 'వారీసు'. తెలుగులో 'వారసుడు' పేరుతో రిలీజ్‌ అవుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈనెల 11న ఈ సినిమా విడుదల చేయనున్న్నట్లు మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు బుకింగ్‌ యాప్స్‌లో ఈ సినిమా కనిపించకపోవడం సందిగ్ధత మొదలైంది.

రిలీజ్‌కు రెండు రోజులే ఉన్నా ఇంకా మూవీ టీం క్లారిటీ ఇవ్వకపోవడంతో అసలు ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందా? లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా దీనిపై నిర్మాత దిల్‌రాజు స్పందించారు. తానే ఒక అడుగు వెనక్కి వేశానని, సినిమాను 11కి బదులుగా 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'చిరంజీవి, బాలయ్య సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలి. అందరు నిర్మాతలు బాగుండాలి. దీంతో నేనే ఒక అడుగు వెనక్కి తగ్గాను. అందరూ నామీద పడి ఏడుస్తున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలుంటాయి. ఇండస్ట్రీ పెద్దలతో డిస్కస్‌ చేసిన తర్వాత సినిమాను రెండు రోజులు ఆలస్యంగా విడుదల వేయాలని నిర్ణయించాం' అంటూ వెల్లడించారు. కాగా తమిళంలో వారీసు రిలీజ్‌లో ఎలాంటి వాయిదా లేదు. ముందుగా అనుకున్న సమయానికే 11న అక్కడ విడుదల చేయనున్నారు. 

మరిన్ని వార్తలు