Vijayendra Prasad: ఇప్పుడే ఒక అద్భుతం చూశా, తెలంగాణ బిడ్డగా చాలా సంతోషపడుతున్నా

19 May, 2023 12:33 IST|Sakshi

పట్టుదల, అకుంఠీత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను చేపడుతూ.. కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారన్నారు రాజ్యసభ సభ్యులు, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్. తన కలంతో ప్రపంచం మెచ్చిన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి పాన్ వరల్డ్ సినిమాలను అందించిన విజయేంద్ర ప్రసాద్ శుక్రవారం నాడు తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారసత్వ సాంస్కృతిక వైభవం, ఆధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం ఉందంటూ  ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

 

“ఇప్పుడే ఒక అద్భుతం చూశాను. వేరే ఎవరు చెప్పినా నమ్మేవాన్ని కాదు, స్వయంగా చూశాను. అతి తక్కువ సమయంలో.. అతి తక్కువ బడ్జెట్‌లో జనం కోసం ఒక గొప్ప నిర్మాణం చేశారు. నిజం చెప్పాలంటే కేసీఆర్ ఒక మిరాకిల్ క్రియేట్ చేశారు. అది ఆయనకే సాధ్యం. పది నెలల సమయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అంతకు మించిన ఒక గొప్ప ప్రజా సచివాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. ఇది అందరికీ ఉపయోగపడే నిర్మాణం. ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతుంది. ఈ అభివృద్ధి పట్ల తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉన్నాను' అంటూ ఆనందం వ్యక్తం చేశారు విజయేంద్ర ప్రసాద్.

చదవండి: పుష్ప శ్రీవల్లితో ఐశ్వర్య రాజేశ్‌ పంచాయితీ.. స్పందించిన రష్మిక

మరిన్ని వార్తలు