మరమ్మతులకు నిధులు మంజూరు
పనులు ప్రారంభించడంలో జాప్యం
నడిగూడెం: మండల కేంద్రం సమీపాన ఉన్న సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఉన్న ఎల్–34 ఎత్తిపోతల పథకం అధ్వానంగా మారింది. మోటార్లు పని చేయడం లేదు. పైపులైన్లు దెబ్బతిన్నాయి. మేజర్, మైనర్ కాల్వలు పలుచోట్ల పూడి, కంప చెట్లమయంగా మారాయి. దీంతో చివరి భూములకు కూడా నీరందని పరిస్థితి నెలకొంది.
ఈ పథకం కింద నడిగూడెం పరిధిలో దాదాపు 100 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది నీటి పారుదల శాఖ కింద అత్యవసర మరమ్మతుల కోసం రూ.15 లక్షలు మంజూరు చేసింది. కానీ నిధులు మంజూరు చేసి దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పనులు చేపట్టలేదు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.