కృష్ణగిరి: ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.30కోట్లతో నూతనంగా 9 విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఏపీఎస్పీడీసీఎల్ (ఆపరేషన్) ఎస్ఈ ఉమాపతి తెలిపారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది సబ్స్టేషన్లలో మూడు జగనన్న కాలనీల్లో, ఒకటి టిడ్కో గృహసముదాయం వద్ద, మిగిలిన వ్యవసాయానికి సంబంధించి మంజూరు కావడం జరిగిందన్నారు. ఆదోని, నంద్యాల, ఆత్మకూరులోని జగనన్న కాలనీల్లో, కర్నూలు టిడ్కో, కృష్ణగిరి మండలం చిట్యాల, కోడుమూరు మండలం చిల్లబండ, ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ, పాణ్యం మండలం చిల్లకల్, రుద్రవరం మండలం నాగులవరం గ్రామాల్లో కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట డోన్ డీఈ ప్రసాద్రెడ్డి, ఏడీ రమణారావు, ఏఈ మద్దిలేటి, వీఆర్వో ఆయ్యన్న, లైన్మెన్ ధనుంజయగౌడ్, నాయకులు లక్కసాగరం రాముడు, బసవరాజు ఉన్నారు.