ఇన్ఫీ నారాయణ మూర్తికి, రాధికా గుప్తా స్ట్రాంగ్‌ కౌంటర్‌ 

30 Oct, 2023 09:38 IST|Sakshi

దశాబ్దాల తరబడి అంతకంటే ఎక్కువే పని  చేస్తున్నాం

మహిళల శ్రమని ఎవరూ గుర్తించడం లేదు: ఎడిల్వీస్‌ సీఎండీ

70 Hour Week Remark controversy:  వారానికి 70 గంటల పనిపై ఇన్ఫోసిస్‌ కో-ఫౌండర్‌ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల దుమారం  ఇంకా కొనసాగుతూనే ఉంది. యువత వారానికి 70 గంటలు కచ్చితంగా పని చేయాలన్న వ్యాఖ్యలపై  అటు నెటిజన్లు నుంచి ఇటు పలు టెక్‌ దిగ్గజాల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ క్రమంలో ఎడిల్‌వీస్ సీఎండీ రాధికా గుప్తా స్పందించారు. భారతీయ మహిళలు దశాబ్దాల తరపడి 70 గంటలకు మించి పనిచేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదంటూ  విచారం వ్యక్తం చేశారు.

ఇంటి పని, ఆఫీసు పనిని బ్యాలెన్స్‌ చేసుకోవడంతోపాటు, తరువాతి తరం పిల్లలభవిష్యత్‌ను సక్రమంగా తీర్చిదిద్దుతూ చాలామంది భారతీయ మహిళలు 70 గంటల కంటే ఎక్కువే శక్తికి మించి పని చేస్తున్నారని రాధికా గుప్తా గుర్తు చేశారు. దశాబ్దాల తరబడి చిరునవ్వుతో ఓవర్‌ టైంని డిమాండ్‌ చేయకుండానూ అదనపుభారాన్ని మోస్తూనే ఉన్నారు. కానీ  విచిత్రంగా దాన్ని ఎవరూ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పోస్ట్‌పై చాలామంది సానుకూలంగా స్పందించారు.  ముఖ్యంగా ప్రముఖ బిజినెస్‌ ఎనలిస్ట్‌ లతా వెంకటేష్‌ స్పందిస్తూ నిజానికి, తన భర్త, తానూ  కూడా తమ కుమారుడి పెంపకంలో  చాలా సాయం చేశారు. అలాగే ముంబై లాంటి మహానగరాల్లో  పనికంటే మనం అందరం ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అంటూ పరోక్షంగా మూర్తి వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్వీట్‌ చేశారు. అవును అమ్మకు ఆదివారం లేదు.. వారాంతంలో కూడా పనిచేయాలని ఒకరు,  ఆఫీస్  పని లేకపోయినా కూడా భారతీ మహిళలు కుటుంబ పోషణ కోసం వారానికి 72 గంటలకు పైగానే పని చేస్తున్నారు.  చాలా కరెక్ట్‌గా చెప్పారు..అలుపెరుగని ఆడవారి శ్రమను ఎవరూ గుర్తించడం లేదంటూ ఆమె ట్వీట్‌ చేశారు. ఇప్పటికైనా వారి కమిట్‌మెంట్‌ను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు మరో యూజర్‌.

అందరికంటే ముందు లేచేది అమ్మ.. అందరికంటే చివర్లో తినేది అమ్మే.. ఆఖరికి చివరగా నిద్రపోయేదీ అమ్మే అంటూ ఒక  యూజర్‌ కమెంట్‌ చేశారు. పితృస్వామ్యం అంతరించేంత వరకు ఈ వివక్ష పోదు. వెస్ట్రన్‌లో కూడా పూర్తి సమయం ఉద్యోగం చేసే మహిళలు ఇంట్లో బానిసలుగా ఉన్నారు. వీకెండ్‌లో పురుషులంతా పార్టీలు చేసుకుంటారు. అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చూసే వరకు...ఏదీ మారదు మరోయూజర్‌ వ్యాఖ్యానించారు.

కాగా ఇన్ఫోసిస్ మాజీ  సీఈవో మోహన్‌దాస్ పాయ్‌తో  నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సందర్భంగా  అభివృద్ధి చెందిన దేశాలతో పోటీగా  మన  దేశం కూడా ఆర్థికంగా పుంజుకోవాలంటే యువత వారానికి 70 గంటలు తప్పనిసరిగా పనిచేయాలని నారాయణ మూర్తి సూచించారంటూ మీడియాలో పలు కథనాలు వెలు వడ్డాయి. దీంతో నెటిజన్లు చాలావరకు ఆగ్రహం వ్యక్తం చేశారు.  అయితే భవిష్‌ అగర్వాల్‌, జేఎస్‌డబ్ల్యూ సజ్జన్‌సిందాల్‌ సహా కొంతమంది పరిశ్రమ దిగ్గజాలు ఇన్ఫీ మూర్తికి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు