నేను అఘోరాను.. గంజాయి సేవిస్తూ బతికేస్తా!

5 Nov, 2020 15:48 IST|Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడులో ఓ అఘోరా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. గొయ్యిలో కూర్చుని పూజలు చేస్తున్న అతడికి సర్ది చెప్పి, బయటకు తీసుకువచ్చేసరికి వారి తలప్రాణం తోకకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. తేని జిల్లాలోని ఆండీపట్టికి చెందిన సొక్కనాథన్‌ చిన్నపుడే ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో కాశీకి చేరుకున్న అతడు అఘోరాల చెంతకు చేరి వారితోనే జీవించసాగాడు. పాతికేళ్లపాటు అక్కడే ఉన్న సొక్కనాథన్‌ కూడా వారిలాగే అఘోరాగా మారిపోయాడు. అయితే ఒకానొక రోజు, తాను పుట్టిపెరిగిన సొంతూరుకు వెళ్లాలనే కోరిక పుట్టడంతో, కాశీ నుంచి నేరుగా తమిళనాడు వచ్చేశాడు.  తన పేరును అఘోర స్వామిజీగా మార్చేసుకుని, నివాసం ఉండేందుకు వీలుగా ఊరి చివర ఓ 12 అడుగుల గొయ్యి తీసుకున్నాడు.(చదవండి: ఎల్లో అలర్ట్‌: చెన్నై ఉక్కిరిబిక్కిరి.. )

అందులోనే దేవుడి ఫోటోలు పెట్టుకుని పూజలు చేయడం మొదలు పెట్టాడు. సొక్కనాథన్‌ ఆహార్యం, వ్యవహారశైలితో బెంబేలెత్తిపోయిన స్థానికులు, అతడు క్షుద్ర పూజలు చేస్తున్నాడని భావించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. గొయ్యిలో ఉన్న అఘోరా స్వామిజీ అలియాస్‌ సొక్కనాథన్‌ విన్యాసాలు చూశారు. గొయ్యిలోంచి పైకి రమ్మని నచ్చజెప్పారు. కానీ సొక్కనాథన్‌ వారి మాటలను లెక్కచేయలేదు. ‘‘నేను అఘోరాను .. ఆహారం ముట్టుకోను.. శివుడిని ప్రార్థిస్తూ గంజాయి తాగుతూ బతికేస్తున్నాను'.. అంటూ వాగ్వాదానికి దిగాడు. అతడి ప్రవర్తనతో విసిగెత్తిపోయిన పోలీసులు.. సొక్కనాథన్‌ను బలవంతంగా గొయ్యిలోంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం గొయ్యిని పూడ్చేశారు. పూజల పేరుతో భయాందోళనలు సృష్టించే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తే కఠిన శిక్ష తప్పదంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు