Rajastan: ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం.. సీఎం గెహ్లాట్‌

30 Nov, 2023 17:45 IST|Sakshi

న్యూఢిల్లీ : ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలవబోదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం జోస్యం చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌కు కొన్ని గంటల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఇదివరకే పోలింగ్‌ పూర్తవగా తెలంగాణలో ఈరోజు పోలింగ్‌ జరిగింది. 

ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా రాజస్థాన్‌లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం గెహ్లాట్ అన్నారు. పార్టీ ఎన్నికల అవకాశాల గురించి సీఎం గెహ్లాట్ విలేకరులతో మాట్లాడుతూ, "ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలవలేదు" అన్నారు. 

ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మధ్యప్రదేశ్. 2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు సాధించింది.  బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో గెహ్లాట్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. కాగా ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.

మరిన్ని వార్తలు