కొవిడ్‌తో అనాథలైన పిల్లలకు ప్రతి నెల రూ.2500

18 May, 2021 19:10 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఈ కోవిడ్ కొన్ని కుటుంబాల్లో తల్లితండ్రులకు పిల్లలను దూరం చేస్తే, మరి కొన్ని కుటుంబాల్లో పిల్లలకు వారి తల్లితండ్రులను దూరం చేసింది. ఇలా కొవిడ్‌తో తల్లితండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చిన్నారులకు 25ఏళ్లు వచ్చేదాకా ప్రతి నెల రూ.2,500 జమ చేయడంతో పాటు ఉచిత విద్య అందించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

అలాగే, పేద కుటుంబాలకు చెందిన 72 లక్షల మందికి ఈ నెలలో 10 కిలోల ఉచిత రేషన్ లభిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. ఇందులో సగం ఢిల్లీ ప్రభుత్వం, మిగిలినవి కేంద్ర ప్రభుత్వ పథకం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లో సంపాదించే వ్యక్తి కరోనాతో మరణిస్తే ఆ కుటుంబాలకు నెలకు రూ.2,500 అందజేయనున్నట్లు తెలిపారు. ఇంట్లో సంపాదించే భర్తను కోల్పోతే భార్యకు, వివాహం కాని కొడుకును కోల్పోతే తల్లితండ్రులకు ఈ సాయాన్ని అందజేస్తామన్నారు. మీ బాధను మేము అర్థం చేసుకున్నాము. వారిని తిరిగి మేము తీసుకురాలేమని మాకు తెలుసు, కాని ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందని” ముఖ్యమంత్రి అన్నారు. దిల్లీలో కరోనాతో నిన్నటివరకు 21,846మంది మృత్యువాత పడ్డారు. గత కొద్దీ రోజుల నుంచి ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

చదవండి:

ఈ పెన్షన్ పథకంలో చేరితే ప్రతి నెల రూ.5 వేలు

మరిన్ని వార్తలు