ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు బాంబు బెదిరింపు.. పోలీసుల అలర్ట్‌

2 Feb, 2024 13:22 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం మహారాష్ట్ర రాజధాని ముంబై నగరానికి బాంబు బెదిరింపు కాల్స్‌ వచ్చిన విషయం విదితమే. నగరంలో ఆరు చోట్ల బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి బెదిరించారు. అప్రమత్తమైన ముంబై పోలీసులు యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈలోపే దేశ రాజధానిలోనూ బాంబు బెదిరింపులు వచ్చాయి.

ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు బెదిరింపులు అందాయి. ఉదయం 10 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్‌ చేసి ఢిల్లీ స్కూల్‌లో బాంబ్‌ పెట్టినట్లు   బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బాంబ్‌ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని క్యాంపస్‌ నుంచి ఖాళీ చేయించారు. రెండు గంటలపాటు తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చదవండి: ‘నాతో సెల్ఫీ మాములుగా ఉండదు’.. టూరిస్టులను వెంబడించిన గజరాజు

whatsapp channel

మరిన్ని వార్తలు