Turkey Earthquake: ఆశలు ఆవిరి.. టర్కీలో భారతీయ యువకుడు మృతి..

11 Feb, 2023 18:58 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: టర్కీలో అదృశ్యమైన భారతీయ యువకుడు విగత జీవిగా మారాడు. వ్యాపార పనుల నిమిత్తం టర్కీ వెళ్లిన భారత్‌కు చెందిన ఓ యువకుడు ఫిబ్రవరి 6న అక్కడ సంభవించిన వరుస భూకంపాల తర్వాత అదృశ్యమైన విషయం తెలిసిందే. భూకంపం సంభవించి నాలుగు రోజులైనా అతని ఆచూకీ తెలియలేదు. అయితే విజయ్‌ కుమార్‌ బస చేసిన హోటల్‌ శిథిలాల వద్ద శుక్రవారం అతని పాస్‌పోర్టు ఇతర వస్తువులు లభించాయి.

తాజాగా శనివారం విజయ్‌ కుమార్‌ మృతదేహం లభ్యమైంది. అతడు బస చేసిన మలత్వాలోని హోటల్‌ శిథిలాల కింద విజయ్‌ కుమార్‌ మృతదేహం గుర్తించినట్లు టర్కీలోని భారత రాయబార కార్యాలయం దృవీకరించింది. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. విజయ్‌ మృదేహాన్ని  అవశేషాలను అతని కుటుంబానికి వీలైనంత త్వరగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.

అసలేం జరిగిందంటే
కర్ణాటక రాజధాని బెంగళూరు ప్రాంతానికి చెందిన ఇంజినీర్‌ టర్కీలో చోటు చేసుకున్న  భూ కంపంలో గల్లంతయ్యాడు.  ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన విజయ్‌కుమార్‌ బెంగళూరులో పీణ్యలోని  నైట్రోజన్‌ ఉత్పత్తి సంస్థలో తమ్ముడితో కలిసి ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అదే ప్రాంతంలో ఇద్దరూ నివాసం ఉంటున్నారు. ఫ్యాక్టరీకి అవసరమైన పరికరాల కోసం విజయ్‌కుమార్‌ నాలుగు నెలల క్రితం టర్కీకి వెళ్లారు.

తుర్కియేలోని తూర్పు అనటోలియా ప్రాంతం మలత్యాలోని  అవ్సర్ హోటల్‌లో దిగాడు. టర్కీలో భూకంపం వచ్చినప్పటినుంచి విజయ్‌కుమార్‌ నుంచి ఫోన్‌ రాలేదని తమ్ముడు అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఈ క్రమంలో టర్కీలో అదృశ్యమైన విజయ్‌కుమార్‌ పాస్‌పోర్ట్, వస్తువులు లభించాయి. అతను బస చేసినట్లు భావిస్తున్న హోటల్ శిథిలాలను రెస్క్యూ సిబ్బంది తొలగించిన తర్వాత స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: అద్భుతం: 90 గంటలు శిథిలాల కిందే.. మృత్యువును జయించిన10 రోజుల చిన్నారి

మరిన్ని వార్తలు