-

రైల్వే ఘనకార్యం! మూడు రోజుల్లో రిటైరయ్యే ఉద్యోగి బదిలీ

27 Nov, 2023 22:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్‌పూర్ డివిజన్‌కు చెందిన ఒక సీనియర్ ఇంజనీర్ విషయంలో రైల్వేబోర్డ్‌ ఘనకార్యం చేసింది. మరో మూడు రోజుల్లో రిటైరవుతున్న కేపీ ఆర్యను ఢిల్లీలోని నార్తర్న్ రైల్వే జోన్‌కు బదిలీ చేసింది. ఖంగుతిన్న ఆయన బదిలీపై నిరాశను వ్యక్తం చేస్తూ రైల్వే బోర్డు సెక్రటరీకి ఘాటు లేఖ రాశారు. బదిలీ ఆర్డర్‌ను ఆయన బుద్ధిలేని పనిగా పేర్కొన్నారు.

బదిలీ ఉత్తర్వు ప్రకారం కేపీ ఆర్య నవంబర్ 28న హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ పోస్ట్‌పై నార్తర్న్‌ రైల్వేలో చేరాల్సి ఉంది. అయితే ఆయన పదవీ విరమణ నవంబర్ 30న ఉంది. ఈ ఆర్డర్ పైకి బాగానే మూడు రోజుల్లో రిటైరవుతున్న తనను బదిలీ చేయడంలో పిచ్చితనమే కనిపిస్తోందని ఆర్య అన్నారు. ఇది జీవితమంతా ఇండియన్ రైల్వే సంస్థకు సేవ చేసిన ఒక ఉద్యోగిని పదవీ విరమణ సమయంలో కావాలని బదిలీ చేయడమే తప్ప మరొకటి కాదు అన్నారు. దీని వల్ల పదవీ విరమణ సెటిల్‌మెంట్‌కు అంతరాయం ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌లో హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ పోస్ట్‌ ఖాళీగా ఉన్నప్పటికీ, రైల్వే బోర్డు తనను  నార్తర్న్ రైల్వే జోన్‌లో ఖాళీగా ఉన్న పోస్ట్‌కు బదిలీ చేసిందని ఆర్య పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. పదవీ విరమణకు ముందు కేవలం మూడు రోజులు తాను న్యూఢిల్లీలోని నార్తర్న్ రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం రైల్వే శాఖ తనకు దాదాపు రూ. 3 లక్షలు చెల్లిస్తుందని, ఇది ప్రజాధనాన్ని పూర్తిగా వృధా చేయడమేనని ఆయన ఆక్షేపించారు. 

ఇది ప్రమోషనల్ ట్రాన్స్‌ఫర్‌గా చెబుతున్నప్పటికీ దీని వల్ల తనకు అదనపు ఆర్థిక ప్రయోజనాలేవీ అందించలేదని ఆర్య పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తనకు ఇప్పటికే ఆర్థిక ప్రయోజనాలకు అర్హత ఉన్నప్పటికీ తన పదోన్నతిని ఆరు నెలలు ఆలస్యం చేశారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు