madhya pradesh: సీఎం సొంతూళ్లో సంబరాలు... రెస్టారెంట్‌లో చాయ్‌ ఫ్రీ!

14 Dec, 2023 07:39 IST|Sakshi

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన సొంత ఊరు ఉజ్జయినిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మోహన్‌ యాదవ్‌ మద్దతుదారులు నగరాన్ని సీఎం అభినందనల పోస్టర్లతో నింపేశారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయినందుకు అతని అభిమాని ఒకరు తన రెస్టారెంట్‌లో రోజంతా ఉచితంగా టీ పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం భోపాల్‌లో జరిగినప్పటికీ, ఉజ్జయినిలో పండుగ వాతావరణం కనిపించింది. మోహన్‌ యాదవ్‌ అభిమాని ఆశిష్ రాథోడ్.. ఘాస్ మండిలోని తన హరిఓమ్ రెస్టారెంట్‌లో అందరికీ ఉచితంగా టీ అందించారు.

మన దేశ ప్రధాని ఒకనాడు టీ విక్రయించారని, మోహన్ యాదవ్ కూడా కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నారని రాథోడ్ పేర్కొన్నారు. మోహన్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి కావడంతో నగర కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయాన్నారు. ఈ సంబరాల నేపధ్యంలో తాను 300 లీటర్ల పాలు వినియోగించి, టీ తయారు చేసి, నగరవాసులకు  ఉచితంగా అందిస్తున్నానన్నారు.
ఇది కూడా చదవండి: లౌడ్‌ ‍స్పీకర్లు బ్యాన్‌.. మాంసం విక్రయాలపై మార్గదర్శకాలు!

>
మరిన్ని వార్తలు