-

Haryana: మేనకోడలిపై నోట్ల కట్టలు కుమ్మరించిన మేనమామ!

28 Nov, 2023 13:47 IST|Sakshi

చాలామంది అన్నదమ్ములు తమ సోదరికి జన్మించిన సంతానాన్ని అమితంగా ప్రేమిస్తుంటారు. వారి చేత ‘మామయ్యా..’ అని పిలిపించుకోవాలని తపన పడిపోతుంటారు. అయితే ఈ మెట్లనన్నింటినీ దాటేసిన ఒక మేనమామ తన మేనకోడలికి పెళ్లిలో ఘనమైన కానుకను సమర్పించుకున్నాడు. హర్యానాలోని రేవాడీలో ఓ వ్యక్తి తన మేనకోడలి పెళ్లిలో ఆమెకు ఇచ్చిన కానుక సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన వితంతు సోదరి కుమార్తెకు కానుకగా ఇచ్చేందుకు అతను సోదరి ఇంట్లో రూ.500 నోట్ల కట్టలను కుప్పలుగా పోశాడు. 

మేనకోడలికి ఖరీదైన కానుకను అందించిన ఆ వ్యక్తి పేరు సత్బీర్. అతను క్రేన్ వ్యాపారి. సత్బీర్ తన మేనకోడలి పెళ్లిలో ఆమెకు విలువైన నగలు కూడా బహూకరించాడు. సత్బీర్ మొత్తంగా ఒక కోటి, ఒక లక్షా పదకొండు వేల నూటొక్క రూపాయలను పెళ్లి కుమార్తెకు కానుగా ఇచ్చాడు. ఈ ఘటనలో నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన యూజర్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

అసల్వాస్ రేవారి.. ఇది జైపూర్-ఢిల్లీ హైవేకి ఆనుకుని ఉన్న ఒక గ్రామం. ఈ ప్రాంతానికి చెందిన సత్బీర్ సోదరి వివాహం సిందర్‌పూర్‌లో జరిగింది. పెళ్లయిన కొంతకాలానికి ఆమె భర్త మృతి చెందాడు. సత్బీర్ సోదరికి ఒక కుమార్తె ఉంది. తన మేనకోడలి పెళ్లి సందర్భంగా సత్బీర్ తన ఊరి ప్రజలతోపాటు తన సోదరి ఇంటికి చేరుకున్నాడు. పెళ్లిలో సత్బీర్ తన మేనకోడలికి ఇచ్చిన కానుకను చూసి స్థానికులు ఆశ్యర్యపోయారు.  ఈ సంద్భంగా సోదరి ఇంటిని  సత్బీర్‌ రూ.500 నోట్ల కట్టలతో నింపేశాడు. కోటి రూపాయలకుపైగా మొత్తాన్ని తన మేనకోడలికి బహూకరించాడు. 
ఇది కూడా చదవండి: ఆ గనిలో మహిళలకే పని.. కారణమిదే!

 

మరిన్ని వార్తలు