Chandrayaan 3 Timelines: మామా.. మేమొస్తున్నాం...!

15 Jul, 2023 06:30 IST|Sakshi

చంద్రయాన్‌–3 ప్రయోగం దిగి్వజయం 

ముచ్చటగా మూడోసారి విజయవంతం

సూటిగా కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం

మళ్లీ సత్తా చాటిన బాహుబలి రాకెట్‌

చంద్రుని చేరే దిశగా కీలక ముందడుగు

ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి

ఫలించిన శాస్త్రవేత్తల కృషి, దేశమంతా సంబరాలు

రాష్ట్రపతి, ప్రధాని తదితరుల ప్రశంసలు

ఆగస్టు 23న చంద్రుడిపై దిగనున్న ల్యాండర్, రోవర్‌

ఆ తర్వాత చంద్రుడిపై కీలక పరిశోధనలు

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అది శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగ (షార్‌) కేంద్రం. అటు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇటు యావద్దేశం ఊపిరి కూడా బిగబట్టి మరీ అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలైంది. 25.3 గంటల కౌంట్‌డౌన్‌కు నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు తెర పడింది. ఆ వెంటనే ఇస్రో బాహుబలి ఎల్‌వీఎం3–ఎం4 రాకెట్‌ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది.

గత వైఫల్యాల నేపథ్యంలో అంతటా ఉది్వగ్న వాతావరణం. అందరిలోనూ మరింత ఉత్కంఠ. మనసు మూలల్లో ఎక్కడో కాసింత అనుమానం. కానీ, ఉత్కంఠకు తెర దించుతూ, అనుమానాలను పటాపంచలు చేస్తూ మన బాహుబలి దిగి్వజయంగా రోదసి చేరింది. అంతరిక్ష సీమలో విజయనాదం చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పదేళ్ల కల నెరవేరింది.

చంద్రయాన్‌–1, 2 ప్రయోగాలు నిరాశ పరిచినా పట్టు వీడకుండా మొక్కవోని దీక్షతో మన శాస్త్రవేత్తల బృందం రాత్రింబవళ్లు పడిన కష్టం ఎట్టకేలకు ఫలించింది. ముచ్చటగా మూడోసారి చంద్రయాన్‌–3 ప్రయోగం విజయవంతమైంది. మూడు దశల ఎల్‌వీఎం3–ఎం4 రాకెట్‌ చంద్రయాన్‌–3 త్రీ–ఇన్‌–ఒన్‌ మిషన్‌ను విజయవంతంగా రోదసి చేర్చి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని మొదలుకుని ప్రముఖులంతా ఇస్రోను, ఇంతటి విజయానికి కారకులైన శాస్త్రవేత్తల బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు.

ఆ ఉది్వగ్న క్షణాలు...
తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్‌ కేంద్రం నుంచి శుక్రవారం చేపట్టిన చంద్రయాన్‌–3 ప్రయోగం సూపర్‌ సక్సెసైంది. 640 టన్నుల ఎల్‌వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహకనౌక, 3,920 కిలోల చంద్రయాన్‌–3 ఉపగ్రహాన్ని మోసుకుని నింగివైపునకు వేగంగా దూసుకెళ్లింది. వెంటనే మిషన్‌ కంట్రోల్‌ రూంలోని శాస్త్రవేత్తలు టెన్షన్‌గా కంప్యూటర్లను ఆపరేట్‌ చేస్తూ కంటిమీద రెప్ప వాల్చకుండా రాకెట్‌ గమనాన్ని పరిశీలించారు. మూడు దశలతో కూడిన ప్రయోగాన్ని 16.09 నిమిషాల్లో పూర్తిచేశారు.

చంద్రయాన్‌–3 మిషన్‌ను భూమికి 36,500 కిలోమీటర్లు ఎత్తులో హైలీ ఎసెంట్రిక్‌ అర్బిట్‌ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రోకు ఇది 89వ విజయం. గ్రహాంతర ప్రయోగాల్లో చంద్రయాన్‌–3 నాలుగో ప్రయోగం కాగా చంద్రునిపై పరిశోధనల నిమిత్తం చేసిన ప్రయోగాల్లో మూడోది. ఇది ఇస్రో బాహుబలి రాకెట్‌ జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 సిరీస్‌లో మూడు ప్రయోగాలు, ఎల్‌వీఎం–3గా పేరు మార్చాక నాలుగో ప్రయోగం! కార్యక్రమాన్ని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ప్రధాని కార్యాలయ ప్రతినిధి జితేంద్రసింగ్‌ స్వయంగా షార్‌ కేంద్రం నుంచి వీక్షించారు.

ప్రయోగం జరిగిందిలా...
► 640 టన్నులు, 43.43 అడుగుల పొడవున్న ఎల్‌వీఎం3–ఎం4 రాకెట్‌ 3,920 కిలోల చంద్రయాన్‌–3 మిషన్‌ మోసుకెళ్లింది.
► చంద్రయాన్‌–3లో 2,145 కిలోల ప్రొపల్షన్‌ మాడ్యూల్, 1,749 కిలోల ల్యాండర్‌ (విక్రమ్‌), 26 కిలోల రోవర్‌ (ప్రజ్ఞాన్‌)ల్లో ఆరు ఇండియన్‌ పేలోడ్స్, ఒక అమెరికా పేలోడ్‌ అమర్చి పంపారు.
► ఎల్‌వీఎం3–ఎం4  రాకెట్‌ తొలి దశలో ఇరువైపులా అత్యంత శక్తిమంతమైన ఎస్‌–200 బూస్టర్ల సాయంతో నింగికి దిగి్వజయంగా ప్రయాణం ప్రారంభించింది.
► ఈ దశలో రెండు స్ట్రాపాన్‌ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 127 సెకెండ్లలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేశారు.
► ద్రవ ఇంజిన్‌ మోటార్లతో కూడిన రెండో దశ (ఎల్‌–110) 108.10 సెకన్లకే మొదలైంది.
► 194.96 సెకన్లకు రాకెట్‌ అగ్ర భాగాన అమర్చిన చంద్రయాన్‌–3 మిషన్‌ హీట్‌ షీల్డులు విజయవంతంగా విడిపోయాయి.
► 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 305.56 సెకన్లకు రెండోదశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు.
► అత్యంత కీలకమైన మూడో దశలో 307.96 సెకన్లకు క్రయోజనిక్‌ (సీ–25) మోటార్లను మండించారు. 954.42 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను విజయవంతంగా పూర్తి చేశారు.
► రాకెట్‌ అగ్ర భాగాన అమర్చిన త్రీ ఇన్‌ వన్‌ చంద్రయాన్‌–3 ఉపగ్రహాన్ని ఈ దశలోనే 969 సెకన్లకు (16.09 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ)170 కిలోమీటర్లు, దూరంగా (అపోజి) 36,500 కిలోమీటర్ల ఎత్తులో హైలీ  ఎసెంట్రిక్‌ అర్బిట్‌ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.

► ల్యాండర్‌ నుంచి రోవర్‌ చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 4 గంటల సమయం తీసుకుంటుందని అంచనా.

► రోవర్‌ సెకనుకు సెంటీమీటర్‌ వేగంతో కదులుతుంది. రోవర్‌ ఒక లూనార్‌ డే (చంద్రుని రోజు–మన లెక్కలో 14 రోజులు) పని చేస్తుంది.
► ఆ 14 రోజుల వ్యవధిలో రోవర్‌ 500 మీ టర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై మూలమూలలనూ శోధించి భూ నియంత్రిత కేంద్రానికి కీలక సమాచారం చేరవేస్తుంది.
► ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో మనది నాలుగో స్థానం. గతంలో రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి.
► చంద్రయాన్‌–1తో ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేసిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది.
► చంద్రయాన్‌–2 ద్వారా ల్యాండర్, రోవర్‌తో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయాలని సంకలి్పంచగా ఆ ప్రయోగం దురదృష్టవశాత్తూ చివరి రెండు నిమిషాల్లో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్‌ అందకుండా పోయాయి. దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుని నిరంతరం శ్రమించి చంద్రయాన్‌–2 సాంకేతిక లోపాలను సరిదిద్దుకుని నాలుగేళ్ల తరువాత చంద్రయాన్‌–3ని దిగ్విజయంగా చంద్రుని కక్ష్యలోకి పంపారు.

చంద్రుడిపైకి ఇలా వెళ్తుంది...
► చంద్రయాన్‌–3 మిషన్‌ మరో 41 రోజుల్లో, అంటే ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుని ఉపరితలంపై దిగుతుంది.
► 16 రోజుల్లో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌లో నింపిన 1,696 కిలోల ఇంధనాన్ని మండించి నాలుగుసార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు.
► ఆగస్టు 1న ఐదోసారి ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను ట్రాన్స్‌ లూనార్‌ ఇంజెక్షన్‌ ద్వారా చంద్రుని దిశగా మళ్లిస్తారు.
► తర్వాత ప్రొపల్షన్‌ మాడ్యూల్‌కు చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు రెట్రో బర్న్‌ చేసి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యను తగ్గించే ప్రక్రియను నాలుగుసార్లు చేపడతారు.
► అలా ఆగస్టు 17న చంద్రయాన్‌–3 చంద్రుని కక్ష్యలోకి వెళుతుంది. తరవాత ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ తన ఎత్తును 100 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లకు తగ్గించుకుంటూ ల్యాండర్‌ను విడిచిపెడుతుంది.
► తరవాత ల్యాండర్‌లోని ఇంధనాన్ని కూడా మండించి ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో సాఫ్ట్‌ లాండింగ్‌ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.
► ల్యాండర్‌ విడిపోయిన తరువాత ల్యాండర్‌ను 15 నిమిషాల పాటు మండించి దాన్ని చంద్రుడి ఉపరితలంపై దించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత కీలకంగా భావిస్తున్నారు.
► ఇప్పటి దాకా ఇలాంటి ల్యాండింగ్‌ ఎవరూ చేయలేదు. మొట్టమొదటిగా భారతే చేయడంతో ప్రపంచమంతా ఇస్రో వైపు చూస్తోంది.
► చంద్రయాన్‌–1లో వాడిన పరిజ్ఞానాన్నే చంద్రయాన్‌–2లోనూ వాడారు. చంద్రయాన్‌–3 ప్రయోగాన్ని కూడా  చంద్రయాన్‌–2 తరహాలోనే నిర్వహించారు.
► చంద్రయాన్‌–2లో ల్యాండర్, రోవర్లను తీసుకెళిన్ల ఆర్బిటర్‌ ఇప్పటికీ చంద్రుని కక్ష్యలోనే పని చేస్తూ విలువైన సమాచారం అందిస్తూనే
వుంది.
► అందుకే ఈసారి ఆర్బిటర్‌కు బదులు ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ద్వారా ల్యాండర్, రోవర్లను పంపారు.
► ఈ ప్రయోగంలో ఇస్రో తొలిసారిగా థొరెటల్‌–అబల్‌ అనే లిక్విడ్‌ ఇంజన్లను చంద్రుని ఉపరితలంపై మృదువైన చోట ల్యాండర్‌ను సురక్షితంగా దించేందుకు ఇప్పట్నుంచే
ప్రయతి్నస్తున్నారు.

మనకిక ఆకాశమే హద్దు
మంత్రి జితేంద్రసింగ్, ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌
చంద్రయాన్‌–3 ప్రయోగం నిజంగా సవాలేనని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. ప్రయోగం విజయవంతమయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు. దేశీయంగా రూపొందించిన ఎల్‌వీఎం3–ఎం4 రాకెట్‌ ద్వారా ప్రయోగం తొలి దశను విజయవంతం చేసినందుకు గర్వంగా ఉందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు కలసికట్టుగా పని చేయడమే ఇంతటి భారీ విజయానికి కారణమన్నారు. ‘‘ఇక రాబోయే 41 రోజులు అత్యంత కీలకం. ఆగస్టు 23న ల్యాండర్‌ను చంద్రునిపై విజయవంతంగా దించేందుకు ప్రయతి్నస్తాం.

ఆగస్టు మూడో వారంలో సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తాం. మిషన్‌ సూర్య, చంద్ర రెండింటినీ పూర్తి చేస్తామని నమ్మకముంది’’ అని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంలో త్వరలో భారత్‌ ప్రపంచంలోనే తొలి స్థానానికి చేరనుందని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్‌ అన్నారు. ఆగస్టు 23న ల్యాండర్‌ చంద్రునిపై దిగితే అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌కు ఆకాశమే హద్దన్నారు. ఇస్రో చైర్మన్‌తో కలిసిరాకెట్, చంద్రయాన్‌–3 నమూనాలను ఆయన ఆవిష్కరించారు. భేటీలో చంద్రయాన్‌–3 ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.వీరముత్తువేల్, మిషన్‌ డైరెక్టర్‌ ఎస్‌. మోహన్‌కుమార్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు