విద్యార్థినిల బట్టలు విప్పించి డ్యాన్స్‌ చేయించిన ఖాకీలు

3 Mar, 2021 17:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్ర జలగావ్‌లో చోటు చేసుకున్న దారుణం

దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపిన హోం మంత్రి

ముంబై: అనాథ ఆశ్రమాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో​ ఉండే బాలికలపై జరిగే దారుణాలకు సంబంధించి అప్పుడప్పుడు వార్తలు చదువుతూనే ఉంటాం. తమకంటూ ఎవరు లేని ఈ అభాగ్యుల పట్ల జాలి, దయ చూపాల్సింది పోయి పశువుల్లా ప్రవర్తిస్తారు కొందరు అధికారులు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. రక్షించాల్సిన ఖాకీలే భక్షకులుగా మారారు. పోలీసులు మరి కొందరు వ్యక్తులతో కలిసి ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటున్న కొందరు విద్యార్థినిల చేత అసభ్య కార్యక్రమాలు చేయించారు. బుల్దానా, చిక్లి నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే శ్వేతా మహాలే దీని గురించి దిగువ సభలో ప్రస్తావించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

రాష్ట్రంలోని జల్‌గావ్‌లో ప్రభుత్వం ఆశాదీప్‌ మహిళల వసతి గృహాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం కొందరు పోలీసు అధికారులు, మరి కొందరితో కలిసి హాస్టల్‌కి వెళ్లారు. అక్కడున్న విద్యార్థినిలను బెదిరించి వారి బట్టలు విప్పించి.. డ్యాన్స్‌ చేయించారు. ఈ దారుణం గురించి ఓ ఎన్జీఓకు తెలియడంతో వారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నేడు శ్వేతా మహాలే దీని గురించి దిగువ సభలో ప్రస్తావించారు. 

ఈ సందర్భంగా శ్వేతా మహాలే మాట్లాడుతూ.. ‘‘ఈ దారుణంలో పోలీసులు కూడా పాలు పంచుకున్నారని తెలిసి సిగ్గుపడుతున్నాము. ఇలాంటి పనులతో రాష్ట్రం పరువు పోతుంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారి పట్ల రాక్షసులుగా మారుతున్నారు. ఇలాంటి బాధితులు చాలా మందే ఉంటారని భావిస్తున్నాం. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ”అన్నారు శ్వేతా మహాలే.

రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. మహాలే లేవనెత్తిన సమస్యకు సమాధానమిస్తూ దేశ్ ముఖ్ ఈ సంఘటనపై దర్యాప్తు జరిపేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని.. వారు రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. దారుణం జరిగిన హాస్టల్‌ను మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తుంది.

చదవండి: 
ఇది పశువుల హాస్టల్‌..
ప్రియుడిని హత్య చేస్తే.. ఓ రాత్రి నీతో గడిపేందుకు ఓకే

మరిన్ని వార్తలు