Updates: నేడు మకరజ్యోతి దర్శనం.. స్వాముల శరణుఘోషతో మార్మోగుతున్న శబరిగిరులు

15 Jan, 2024 07:38 IST|Sakshi

తిరువనంతపురం: శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం కానుంది. ఈ నేపథ్యంలో స్వాములు భారీగా తరలి వస్తున్నారు. శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతున్నాయి. మకర జ్యోతి దర్శనానికి 50 వేల మంది భక్తులకు అనుమతి ఉంటుందని ట్రావెన్కోర్ బోర్డ్ ప్రకటించింది.  కానీ, నాలుగు లక్షల మంది దాకా వీక్షించే అవకాశం ఉండొచ్చని ఒక అంచనా. 

హరిహర తనయుడు అయ్యప్ప స్వామి కొలువైన క్షేత్రం కేరళ శబరిమల. శబరిమల మకరజ్యోతి/మకరవిళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున...శబరిమల ఆలయంలో నిర్వహించే కార్యక్రమం. మకర సంక్రాంతి నాడు ఈ జ్యోతి దర్శనం ఇస్తుంది కాబట్టి శబరిమల మకరవిళక్కు/ శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. 

మకర జ్యోతి దర్శన నేపథ్యంలో.. నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు స్వామి దర్శనం కోసం శబరిమలకు పోటెత్తుతున్నారు.  ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున కనిపించే మకర జ్యోతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు కందమల శిఖరంపై దర్శనమిచ్చే మకర జ్యోతి కోసం ఎదురుచూస్తున్నారు.

ఇవాళ సాయంత్రం 6.30 నుంచి 7.00 గంటల మధ్య ఉంటుంది ఆలయ బోర్డు ప్రకటించింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది.

>
మరిన్ని వార్తలు