మహిళ కళ్లు పొడిచి పరారైన దుండగుడు.. ఏం జరిగింది?

13 Jul, 2022 21:10 IST|Sakshi

పాట్నా: ఇంట్లో నిద్రిస్తున్న మహిళ(45)ను సమీపంలోని జనుము పంటలోకి లాక్కెళ్లి ఆమె కళ్లు పొడిచేసిన సంఘటన బిహార్‌లోని కటిహార్‌ జిల్లాలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ విషాద సంఘటన దక్లా ఇంగ్లీష్‌ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు నిందితుడుని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. మహిళపై దాడి చేసి చూపు కోల్పోయేలా చేసిన దుండగుడు ఎండీ షామిమ్‌గా గుర్తించారు పోలీసులు. 'నిందితుడు ఎండీ షామిమ్‌ను అరెస్ట్ చేశాం. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది అత్యాచారమా కాదా అనేది ఇంకా తెలియరాలేదు.' అని ఎస్‌డీపీఓ తెలిపారు.

ఏం జరిగింది?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు గ్రామంలో తన 8 ఏళ్ల కుమార్తెతో జీవిస్తోంది. మంగళవారం రాత్రి తన కూతురితో కలిసి ఇంట్లో నిద్రపోతోంది. ఆమె భర్త నాలుగు రోజుల క్రితం పని కోసం ఢిల్లీ వెళ్లాడు. దుండగుడు అక్కడికి వచ్చి డోర్‌ కొట్టాడు. బాధితురాలు తలుపు తీయగా.. ఆమెను సమీపంలోని జనుము తోటలోకి లాక్కెల్లాడు. చేతులు కట్టేసి తన తల్లి కంట్లో కర్ర పుల్లలను దూర్చాడని, దాంతో తీవ్రంగా రక్తస్రావం అయినట్లు బాధితురాలి కుమార్తె పోలీసులకు తెలిపింది. దాడికి పాల్పడిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 

విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు వెంటనే ఆమెను అమ్దాబాద్‌ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటం వల్ల కటిహార్‌ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. ఆమెకు చూపు వస్తుందనే నమ్మకం లేదని అక్కడి వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి: ప్రియురాలు ద్రోహం చేసిందని తట్టుకోలేక... ఆమెను చంపి...

మరిన్ని వార్తలు