ఓటు వేయకుండానే వెనుదిరిగిన సీఎం జోరాంతంగా.. ఆ తర్వాత

7 Nov, 2023 11:15 IST|Sakshi

ఐజ్వాల్: ఈవీఎం మొరాయించడంతో మిజోరాం సీఎం జోరాంతంగా ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి కాసేపు వేచి ఉన్న సీఎం.. అప్పటికీ ఈవీఎం పనిచేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్‌ నుంచి బయటకు వచ్చారు. మీడియా సమావేశం తర్వాత మళ్లీ తన ఓటు హక్కుని వినియోగించుకుంటానని స్పష్టం చేశారు.  మరికాసేపటి తర్వాత మళ్లీ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

నేడు మిజోరాంలో 40 స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7:00 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్య జనం పోలింగ్‌లో పాల్గొన్నారు. ఐజ్వాల్ నార్త్-II అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 19-ఐజ్వాల్ వెంగ్లాయ్ పోలింగ్ స్టేషన్‌లో ఈరోజు ఉదయం తన ఓటు వేయడానికి సీఎం జోరాంతంగా వెళ్లారు. అదే సమయంలో ఈవీఎం మొరాయించింది. తప్పని స్థితిలో సీఎం జోరాంతంగా వెనుదిరిగారు. మీడియా సమావేశం తర్వాత మళ్లీ తన ఓటు హక్కుని వినియోగించుకుంటానని తెలిపారు. కాసేపయ్యాక మళ్లీ వచ్చి ఓటు వేశారు.

రాష్ట్రంలో అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో దిగారు. మొత్తం 8.57 లక్షల ఓటర్లకుగాను 1,276 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది.

ఇదీ చదవండి: ఎన్నికల వేళ మవోయిస్టు పేలుళ్లు.. సీఆర్‌పీఎఫ్ జవాన్‌కి గాయాలు

మరిన్ని వార్తలు