పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా.. రూ. 75 కాయిన్‌

26 May, 2023 09:28 IST|Sakshi

ఢిల్లీ: పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మే 28వ తేదీన (ఆదివారం) ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభిస్తారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణను సంతరింపజేయాలని కేంద్ర ఆర్థిక శాఖ భావించింది. 

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ. 75 ప్రత్యేక నాణెం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను ప్రతిబింబించేలానూ ఈ నాణేం ఉండనుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

నాణేనికి ఒక వైపు నాలుగు సింహాల అశోక స్థూపం.. క్రింద సత్యమేవ జయతే అని ఉండనుంది. అలాగే.. ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్ అని, కుడి వైపున ఆంగ్లంలో భారత్ అనే పదం చేర్చారు. నాణేనికి రెండో వైపు పార్లమెంట్ బొమ్మతో పాటు ఎగువ అంచున దేవనాగరి లిపిలో సంసద్ సంకుల్ అని, దిగువన ఆంగ్లంలో పార్లమెంట్ కాంప్లెక్స్ అనే పదాలు రాసి ఉంటాయి.  44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉండబోయే నాణేం.. 50% వెండి, 40% రాగి, 5% నికెల్ మరియు 5% జింక్‌తో తయారు చేశారు.

మరిన్ని వార్తలు