టెక్నాలజీ అత్యవసరం.. అందిపుచ్చుకోవాల్సిందే

7 Oct, 2023 05:48 IST|Sakshi

హైకోర్టులకు, న్యాయమూర్తులకు సీజేఐ సూచన

న్యూఢిల్లీ: పలు హైకోర్టుల్లో వర్చువల్‌ విచారణల శాతం తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు విస్మయం వెలిబుచి్చంది. అన్ని కోర్టులు, దేశంలో ప్రతి జడ్జీ టెక్నాలజీని వీలైనంత త్వరగా అందిపుచ్చుకోవాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. పంజాబ్, హరియాణా హైకోర్టు విచారణల్లో వీడియో కాన్ఫరెన్స్‌ వాడకాన్ని పూర్తిగా పక్కన పెట్టిందంటూ దాఖలైన పిటిషన్‌పై సీజేఐ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

న్యాయమూర్తులు టెక్నాలజీ వాడకంలో నిష్ణాతులా కాదా అన్నది కాదు సమస్య. కానీ వారికి దాని వాడకం తెలిసి ఉండాలి. లేదంటే అది అలవాటయ్యేలా శిక్షణ తీసుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా ఇది వర్తిస్తుంది. టెక్నాలజీ వాడకం మీద అవగాహన కోసం వాళ్లు ప్రత్యేక కేంద్రాలకు వెళ్లి శిక్షణ తీసుకున్నారు‘ అని పేర్కొంది.

నేటి పరిస్థితుల్లో టెక్నాలజీ వాడకం ఇంకెంతమాత్రమూ ఆప్షన్‌ కాదని, అత్యవసర పనిముట్టుగా మారిందని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. ఈ మార్పు దిశగా లాయర్లను కూడా సిద్ధం చేయక తప్పదని అభిప్రాయపడ్డారు. బాంబే హైకోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌లకు ఉద్దేశించిన స్క్రీన్స్‌ను తీసేయడం దారుణమన్నారు. ఇకపై మన దేశంలో జడ్జి కావాలంటే టెక్‌ ఫ్రెండ్లీగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.  
 

మరిన్ని వార్తలు