ఒమర్‌ అబ్దుల్లా కుటుంబం గృహనిర్బంధం

15 Feb, 2021 05:55 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌ పోలీసులు తనని, తన కుటుంబ సభ్యుల్ని, తన తండ్రి ఎంపీ అయిన ఫరూక్‌ అబ్దుల్లాని గృహ నిర్బంధంలో ఉంచార ని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ఆదివారం ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. శ్రీనగర్‌లోని గుప్కార్‌ ప్రాంతం లో తన ఇంటి బయట ఉన్న పోలీసు వాహనా లకు సంబంధించిన ఫోటోల ను కూడా ఆయన షేర్‌ చేశారు. ‘‘ఆగస్టు, 2019 తర్వాత కనిపిస్తున్న కొత్త కశ్మీర్‌ ఇది. ఎలాంటి కారణం లేకుండా మమ్మల్ని మా ఇంట్లో ఉంచి తాళాలు వేశారు. పార్లమెంటు సభ్యుడైన నా తండ్రిని కూడా నిర్బంధించడం దారుణం.

నా సోదరి, పిల్లల్ని కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు’’ అని ఒమర్‌ అబ్దుల్లా ఆ ట్వీట్‌లో వెల్లడించారు. తమ ఇంట్లో పని చేసే సిబ్బం దినెవరినీ కూడా లోపలికి రానివ్వడం లేదని తెలిపారు. ‘‘ఎలాంటి కారణాలు లేకుండానే ఇంట్లో బంధించి ఉంచారు. ఇంటిలో పనులు చేసుకునే వారిని లోపలికి రానివ్వడం లేదు. మీ కొత్త ప్రజాస్వామ్యం అంటే ఇదేనా’’ అని ఒమర్‌ ప్రశ్నించారు. అయితే పోలీసులు మాత్రం పుల్వామా దాడి జరిగి రెండేళ్లయిన సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా,  కొందరు వీఐపీలు, భద్రత కల్పించాల్సిన వారిని గృహనిర్బంధంలో ఉంచినట్టుగా తెలిపారు. వాళ్లు బయటకొచ్చి తిరిగితే ఎలాంటి వ్యతిరేకత వస్తుందోనని అలా చేసినట్టుగా శ్రీనగర్‌ పోలీసులు అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు.

మరిన్ని వార్తలు