ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల భవనాన్ని ప్రారంభించిన మోదీ

17 Dec, 2023 11:56 IST|Sakshi

సూరత్‌: ప్రపంచంలోనే అతిపెద్ద భవనం "సూరత్ డైమండ్ బోర్స్"ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ప్రధాని మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సూరత్‌లో నేడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రోడ్‌ షో నిర్వహించారు. సూరత్‌ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ను కూడా ప్రారంభించారు. 

 సూరత్‌లో రూ.3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది.  డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్‌కనెక్టడ్ భవనం. దాదాపు 4500 కార్యాలయాలను కలిగి ఉన్న ఈ భవనం.. పెంటగాన్‌లో ఉన్న భవనం కంటే పెద్దది కావడం విశేషం.

  

సూరత్‌లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్‌ ఒకటే వేదికగా మారనుంది.  దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గొడుగు కిందకు తెచ్చినట్లవుతుంది. 

15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో 4500 కార్యాలయాలు  ఉన్నాయి. ఇది తొమ్మిది దీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. 

ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు

>
మరిన్ని వార్తలు