మా ఆసుపత్రిలో కరోనాతో ఒక్కరూ చనిపోలేదు 

2 Jul, 2021 11:16 IST|Sakshi

పొద్దార్‌ కరోనా కేర్‌ సెంటర్‌ డీన్, తెలుగు వ్యక్తి డా. రాజేశ్వర్‌ రెడ్డి 

వైద్యుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’కి రాజేశ్వర్‌ ఇంటర్వ్యూ

సాక్షి ముంబై: ‘‘ప్రపంచాన్ని హడలెత్తించిన కరోనా మహమ్మారి లక్షలాది మందిని బలి తీసుకుంది. కానీ, మా ఆసుపత్రిలో కరోనాతో ఒక్క మరణం కూడా సంభవించలేదు’’ అని తెలుగు వ్యక్తి, డా. రాజేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది తనతోపాటు మా ఆసుపత్రి వైద్యులు, సిబ్బందే కారణమని చెప్పారు. వర్లీలోని పోద్దార్‌ ఆసుపత్రిలోని కరోనా కేర్‌ సెంటర్‌కు ‘డీన్‌’గా నిజామాబాద్‌కు చెందిన డా. రాజేశ్వర్‌ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. కాగా, జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా రాజేశ్వర్‌ రెడ్డి తన అనుభవాలను ‘సాక్షి’కి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ మా ఆసుపత్రిలో ఒక్కరూ కరోనాతో చనిపోలేదు. మా టీమ్‌ వర్క్‌ చేసిన కృషితో ఆసుపత్రి తమదైన ముద్రను వేసుకోగలిగింది. సుమారు 7 వేలమందికిపైగా మా ఆసుపత్రిలో కరోనా రోగులు వైద్యం కోసం చేరారు. 

వారికి అన్ని విధాల పరీక్షలు చేయడంతోపాటు సరైన వైద్యం అందించాం. డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్స్, ఇతర సిబ్బంది ఇలా అందరం టీం వర్క్‌గా పనిచేయడంతో ఇది సాధ్యమైంది. ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఆసుపత్రి కావడంతో మా వద్ద అంతా ఉచితంగా సేవలందించాం. పేదలు అనేక మంది లబ్ధి పొందారు. కరోనాను జయించి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లే సమయంలో ప్రతి రోగి తమతో చెప్పిన మాటలే నాతోపాటు మా టీంలో నూతన ఉత్తేజాన్ని నింపేది. గతంలో ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పని సమయం ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో నాకైతే సెలవు దినాల్లో కూడా వి«ధులు నిర్వహించాల్సి వస్తోంది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యమే మా ధ్యేయం’’ అన్నారు.  

ఉచితంగానే పరీక్షలు 
పోద్దార్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 1,500 టీకాలను అందిస్తున్నామని డా. రాజేశ్వర్‌ రెడ్డి చెప్పారు. టీకాలు అందుబాటులో ఉంటే మరింత పెంచేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. ముఖ్యంగా కొంత వ్యాక్సిన్ల కొరత కారణంగా ఇవ్వలేకపోతున్నాని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన కరోనా రోగులందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు, వైద్యంతోపాటు టీకాలను అందిస్తున్నామని ఆయన స్పష్టంచేశారు. తెలుగు వారికి చికిత్సతోపాటు కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి సహాయ సహకారాలు అందించినట్లు రాజేశ్వర్‌ చెప్పారు. వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని వారికి అవగాహన కల్పిస్తూ అనేక మందికి టీకాలు వేశామన్నారు. తెలుగు వారు ఎవరైనా తమ ఆసుపత్రికి వస్తే అన్ని విధాలుగా సహకరిస్తున్నానన్నారు. ఇలా తెలుగు వ్యక్తిగా నేను నా వంతు సహకారం అందిస్తున్నట్టు రాజేశ్వర్‌ చెప్పారు.  


1989లో... 
పోద్దార్‌ ఆసుపత్రిలో డా. రాజేశ్వర్‌ రెడ్డి 30 ఏళ్లకుపైగా విధులు నిర్వహిస్తున్నారు. 1989లో క్యాజువలిటీ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంఓ)గా చేరారు. అనంతరం మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆ తర్వాత ప్రొఫెసర్‌గా మారారు. ఇప్పటి వరకు అనేక ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. కరోనా కేర్‌ సెంటర్‌కు ఇన్‌చార్జి డీన్, వ్యాక్సినేషన్‌ ఇన్‌చార్జీగా విధులు నిర్వహిస్తున్న ఆయన తెలుగు వారికి కూడా అత్యధికంగా వ్యాక్సిషన్‌ ఇచ్చేందుకు  కృషి చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు