నితీష్‌ను హిట్లర్‌తో పోల్చిన తేజస్వి యాదవ్‌

22 Jan, 2021 21:00 IST|Sakshi

పాట్నా: సోషల్‌ మీడియాలో చేసే వ్యాఖ్యలను సైబర్‌ నేరంగా పరిగణించే విధంగా గ్యాగ్‌ ఆర్డర్‌ను తీసుకొచ్చిన బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌పై ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌ మండిపడ్డారు. సోషల్‌ మీడియా వేదికగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టడాన్ని సైబర్‌ నేరంగా పరిగణించమని సీఎం నితీష్‌ కుమార్‌ బీహార్ ఆర్థిక నేరాల విభాగానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. తేజస్వి యాదవ్‌ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ప్రజల హక్కులను కాలరాయడంలో నితీష్‌ హిట్లర్‌తో సమానమని విమర్శించారు. 

సీఎం నితీష్‌ కుమార్‌ 60కిపైగా కుంభకోణాలకు పాల్పడ్డారని.. ఆయన అవినీతిలో భీష్ముడంతటివాడని ఆయన ట్విటర్‌ వేదికగా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకునేందుకు ఆయన నేరస్తులకు కొమ్ము కాస్తూ.. అనైతిక, రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. బీహార్‌ పోలీసులు మద్యం అమ్ముతున్నారని హిందీలో ట్వీట్‌ చేసిన తేజస్వి.. ఈ చట్టం కింద తనను అరెస్ట్‌ చేయాలని ఛాలెంజ్‌ చేశారు. ప్రజాస్వామ్యానికి తల్లి లాంటి రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని తేజస్వి విమర్శించారు. నితీష్‌ తన ఆదర్శాలను తాకట్టుపెట్టి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు అమ్ముడుపోయారని, ఆయన సంఘ్‌ పరివార్‌కు చెందిన ముఖ్యమంత్రిగా తయారయ్యారన్నారు.

మరిన్ని వార్తలు