తికాయత్‌.. ఓ చౌకబారు వ్యక్తి: కేంద్ర మంత్రి

24 Aug, 2022 06:54 IST|Sakshi

లఖీమ్‌పూర్‌ ఖేరి(యూపీ): వివాదాస్పద సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులపై కారు దూసుకెళ్లిన కేసులో అరెస్టయిన ఆశిష్‌ మిశ్రా తండ్రి, కేంద్ర సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా.. రైతు సంఘాల నేత రాకేశ్‌ తికాయత్‌పై నోరు పారేసుకున్నారు. ఎనిమిది మంది మరణానికి కారకుడైన ఆశిష్‌కు తండ్రి అయిన అజయ్‌.. మంత్రిగా రాజీనామా చేయాలంటూ డిమాండ్‌చేస్తున్న తికాయత్‌ను ‘చౌక బారు వ్యక్తి’ అంటూ తక్కువచేసి మాట్లాడారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఖేరి ఎంపీ నియోజకవర్గ బీజేపీ మద్దతుదారులనుద్దేశిస్తూ అజయ్‌ మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ‘ఒకవేళ నేను మంచి వేగంతో కారులో వెళ్తున్నాను అనుకుందాం. అప్పుడు ఊర కుక్కలు వెంటబడతాయి. మొరుగుతాయి. వాటి తీరే అంత. అంతకుమించి నేను చెప్పేదేం లేదు. తికాయత్‌ గురించి నాకు బాగా తెలుసు. పొట్టకూటి కోసం రాజకీయాలు, ఉద్యమాలు చేస్తుంటాడు’ అంటూ ఆ వీడియోలో అజయ్‌ వ్యాఖ్యానించారు. అజయ్‌ వ్యాఖ్యానాల వీడియోపై తికాయత్‌ స్పందించారు. ‘ఏడాదికాలంగా కుమారుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. అందుకే అజయ్‌ మిశ్రాకు నాపై కోపం’ అని అన్నారు.

ఇదీ చదవండి: రాజకీయ పార్టీలన్నీ ఉచితాలవైపే 

మరిన్ని వార్తలు